బెజవాడ పాత బస్తీలో పురుగులు పట్టిన మాంసం విక్రయాలు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం 8 మంది కార్పొరేషన్ అధికారులు జరిపిన దాడుల్లో పాతబస్తీలోని 4 మటన్ షాపుల్లో 15 రోజులకుపైగా నిల్వ ఉంచిన, పురుగులు పట్టిన మాంసం విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆయా షాపులను సీజ్ చేయడంతోపాటు, ఆ షాపుల్లో ఉన్న నిల్వలను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకుని దానిపై బ్లీచింగ్ చల్లారు. పురుగులు పట్టిన మాంసం విక్రయిస్తున్నారని తెలియగానే జనం షాపులపై దాడి చేసేందుకు యత్నించారు. అధికారులు నచ్చజెప్పడంతో వారు వెనక్కు తగ్గారు.
ఏమిటీ అరాచకం?
ముఖ్యంగా మటన్ షాపుల్లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసం విక్రయిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ సమస్య ఒక్క బెజవాడలో మాత్రమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా జరిపిన 22 దాడుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసిందని అధికారులు వెల్లడించారు. కేవలం మటన్ షాపుల్లోనే కాక, పేరున్న రెస్టారెంట్లు, 3 స్టార్ హోటళ్లలోనూ నెల రోజులుపైగా డీప్ ఫ్రీజ్ లో పెట్టిన మటన్ వాడుతున్నారని గుర్తించారు. అలా గుర్తించిన రెస్టారెంట్లకు నోటీసులు జారీచేశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో ఇలాంటి కేసుల ఎక్కువగా వస్తున్నాయని, ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.
కిలో మటన్ రూ.200
కిలో మటన్ రూ.200 మాత్రమే. అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమేనని, నూజివీడులో ఓ మటన్ షాపు వ్యాపారి ఇచ్చిన ప్రకటనతో గత ఆదివారం జనం ఆ షాపు ముందు క్యూ కట్టారు. మార్కెట్లో కిలో మటన్ రూ.800 ఉంటే, ఇక్కడ రూ.200 లకు ఎలా అమ్ముతున్నాడని ఎవరూ ప్రశ్నించలేదు. తరవాత రోజు అదే షాపు యజమాని కిలో మటన్ రూ.800 బోర్డు పెట్టడంతో అప్పుడు జనం తిరగబడ్డారు. నిన్న కిలో మటన్ రూ.200లకు అమ్మి ఇవాళ రూ.800 ఏంటని, చనిపోయిన గొర్రెల మాంసం జనానికి అంటగడుతున్నాడంటూ జనం తిరగబడ్డారు. దీంతో ఆ మటన్ షాపును మూసివేశారు. కేవలం మటన్ విషయంలోనే నిల్వ మాసం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. మటన్ కొనుగోలు చేసే వారు మరింత జాగ్రత్తలు పాటించాలని వారు సూచిస్తున్నారు.
తరచూ తనిఖీలు చేయరా?
తరచూ ఆహారపదార్థాలను తనిఖీ చేయాల్సిన అధికారులు, ఆరు నెలలకు ఒకసారి హడావుడి చేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుడ్ సేఫ్టీ అధికారులు ప్రతివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే, నిల్వ మాంసం అమ్మడానికి వ్యాపారులు బయపడతారని, అలా కాకుండా వ్యాపారుల వద్ద ముడుపులు తీసుకుని, ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులకు ముడుపులు చెల్లించని మటన్ షాపు వ్యాపారులనే వారు టార్గెట్ చేస్తున్నారని చిరు వ్యాపారులు విమర్శిస్తున్నారు. పుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయకుండా జనం జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇవ్వడంపై బెజవాడ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా నకిలీలు, కల్తీలకు విజయవాడ కేంద్రంగా విరాజిల్లుతోందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు హడావుడి చేసి కొన్నాళ్లు కనబడకుండా పోతారా, నిరంతరం తనిఖీలు
నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడతారో వేచిచూడాల్సిందే.