(మచిలీపట్నం నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా చాలా ప్రాధాన్యం ఉంది. ఏ మతంలో ఎలాంటి సెంటిమెంటు ఉన్నా రాజకీయనాయకులు ప్రతి దానిని ఫాలో అవుతుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అని ఆశగా చూస్తుంటారు. ఇటీవల గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తిరుగు లేని మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాతుందా? లేదా? అన్న సందేహం తలెత్తుతోంది. అందుకు కొడాలి నాని హేతువు కావచ్చుననే సెంటిమెంట్ కూడా వినిపిస్తోంది.
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము.భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సైతం ఒక్కోసారి కూలిపోవచ్చు. అది స్వయంకృపారాధం వలన కావచ్చు, లేక వెన్నుపోట్లు వలన కావచ్చు చెప్పలేము.
ఒకసారి చరిత్రలోకి వెళితే..
రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపథ్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి తనకు ఎదురులేదు అనుకున్న ఎన్.టి.రామారావు సైతం ఊహించని విధంగా అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తుతుందా అనే సందేహం కలుగుతోంది. అంతేకాక రాజకీయాలలో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిస్తారు రాజకీయనాయకులు. అయితే ఇప్పుడు అటువంటి సెంటిమెంట్ ఒకటి జగన్ సర్కారుకు గుది బండగా మారి దెబ్బతీస్తుందనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు, ఆధినేతలకు ఈ సెంటిమెంట్ కారణంగా వారి ప్రభుత్వాలు పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయాయి. అంటువంటి సెంటిమెంట్ కొడాలి నాని రూపంలో వైసీపీ ప్రభుత్వాన్నివెంటాడుతున్నది.
ఇప్పటివరకు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఎవరైనా రాష్ట్ర మంత్రివర్గంలో చేరితే ఆమంత్రివర్గం పూర్తిస్థాయి కొనసాగిన దాఖలాలు లేవు. టంగుటూరు ప్రకాశం పంతులు దగ్గర నుండి ఎన్.టి.రామారావు, చెన్నారెడ్డి వరకు అందరూ ఈ సెంటిమెంట్ వలన దెబ్బతిన్న వారే కావటం విశేషం.
మద్రాసె ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్న కాలంలో గుడివాడ అసెంబ్లీ గతంలో ద్విసభ్య నియోజకర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం నుండి ఎస్.సి. శాసనసభ్యుడుగా ఎన్నికైన వేముల కూర్మయ్యకు టంగుటూరు ప్రకాశం తన మంత్రివర్గంలో స్ధానం కల్పించారు. ఆ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో కొనసాగలేక పోయింది.
అనంతరం 1983 లో కొత్తగా ఒకరాజకీయ పార్టీని స్థాపించి అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి 201 సీట్లుతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత ఎన్.టి. రామారావు గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసన సభ్యుడుగా ఎన్నికై తొలిసారి కాంగ్రెసేతర
ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అటువంటి ఎన్టీఆర్ సైతం 1984 లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చింది. ఆ పిదప 1985 ఎన్నికలలో గుడివాడ, హిందూపురం నియోజకవర్గాల నుంచి ఎన్.టి.రామారావు ఎన్నికైనప్పటికి గుడివాడ స్థానానికి రాజీనామా చేసి హిందూపురం నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో గుడివాడ సెంటిమెంట్ గురించి వినిపించింది.
ఆ పిదప 1989 లో గుడివాడ అసెంబ్లీ నుంచి ఎన్నికైన కటారి ఈశ్వరకుమార్ ను చెన్నారెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం మనుగడ కొనసాగించలేక పోయింది. ఈ ప్రభుత్వాలు అన్ని పూర్తికాలం కొనసాగలేకపోవటానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గమే కారణంగా పలువురు ఒక సెంటిమెంట్ బలపడింది.
ముచ్చటగా మూడు సార్లు ఇక్కడనుండి ఎన్నికైన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిమండలిలో చేరటం, ఆ మంత్రివర్గాలు పూర్తికాలం కొనసాగకుండానే ముగిసిపోవటం జరిగింది. ఆనాటినుండి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఒక సెంటిమెంట్ గా రాజకీయనాయకులు భావిస్తున్నారు.
జగన్ కు కూడా ఈ సెంటిమెంట్ గండం తప్పదా?
2019 లో జరిగిన ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకుని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మంత్రిమండలిలో గుడివాడ అసెంబ్లీ నుంచి ఎన్నికైన కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని) కి స్థానం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి తన 15 మాసాల పాలనలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలోని దేవాలయాలు, దేవతా విగ్రహాలపైన వరస దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యాయి.
దీనితో బీజేపీ తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు, హిందూ సంఘాలు అందోళన చేపట్టం తో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇదే సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ర్రాష్ట్ర మంత్రిగా ఉన్న కొడాలి నాని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన డిక్లరేషన్ పై వ్యాఖ్యానించటంతో ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్ విశ్వహిందు పరిషత్ వంటి హిందూ సంఘాలన్నీ పెద్దఎత్తున ఆందోళన చేపట్టి కొడాలి నాని ని మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చెస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి హైద్రాబాద్ లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని సైతం ముట్టడించారు.
అంతేగాక బీజేపీ అధిష్టానం సైతం ఈ విషయంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలదుఅన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పైన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ పైన కూడా మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో బీజేపీ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని, అందుకు అదునైన సమయం కోసం ఎదురు చూస్తున్నది.
ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలను దృష్ట్యా ఇదే అదనుగా భావించి అసలు అధికారానికే ఎసరు పెట్టినా పెట్టవచ్చుననే భావన ఆపార్టీ నాయకుల మాట్లాడే మాటలను బట్టి వ్యక్తం అవుతున్నది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏదైనా ఎత్తు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేయకపోవచ్చు కానీ మోడీ, అమిత్ షాలు తలచుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సి.బి.ఐ., ఎన్ఫోర్స్మెంట్ కేసులను బయటికి తీసి మళ్లీ జైలుకు పంపించి, తమిళనాడు తరహాలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి కొడాలి నాని తెస్తున్న తలనెప్పులు వలన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వారు ఏమాత్రం చొరవతీసుకున్న ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు గుడివాడ సెంటిమెంట్ కనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పనిచేస్తే త్వరలోనే రాష్ట్రంలో అనూహ్యంగా అధికార మార్పిడి జరిగే సమయం ఆసన్నమవుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే కొడాలి నాని రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కు పెద్ద గండం ఎదుర్కోవలసివస్తుందని, ఈ గండాన్నీ జగన్మోహన్ రెడ్డి దీటుగా ఎదుర్కొని నిలబడతారో లేక గత ప్రభుత్వాలు మాదిరిగా గుడివాడ సెంటిమెంట్ కు తమ ప్రభుత్వాన్ని బలిచేసుకుంటారో వేచిచూడాలి.
త్వరలో ఇదే సెంటిమెంట్ అంశం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉన్నట్లు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.