‘నేను నెల్లూరు వాడినైనా సిక్కోలు అంటే నాకు అమితమైన ప్రేమ’ అంటూ శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆదరాభిమానాలు చూరగొని, ఈ జిల్లా వాసులతో ‘మిలీనియం గాయకుడు’గా బిరుదు , సత్కారం పొందిన ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్తను జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరన్న వార్త జిల్లాలోని సంగీత అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతోంది. ఆయన గొప్పతనాన్ని, ప్రోత్సాహాన్ని నెమరువేసుకుంటున్నారు. గాయకుడిగానే కాకుండా జిల్లాతోనూ ఎస్పీ బాలుకు ప్రత్యేక అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో జిల్లాలో పర్యటించి తన అభిమానాన్ని చాటారు. తన గీతాలతో ఇక్కడి ప్రజలకు ఆకట్టుకున్నారు.
సిక్కోలు స్వర్ణోత్సవాలలో..
1983లో శ్రీకాకుళంలో సుకుమార్ ఆర్కెస్ట్రా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఎస్పీ పాల్గొన్నారు. సంగీత విద్వాంసుడు బండారు చిట్టిబాబు నిర్వహణలో జరిగిన ఈ విభావరిలో గీతాలను ఆలపిరించారు. 2002లో నగరంలో స్టేడియంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. సిక్కోలు గురించి రాసిన పాటతో పాటు, పలు సినీ గీతాలను తన కమనీయ గానంతో ఉర్రూతలూగించారు. సిక్కోలు తరపున ’మిలీనియం గాయకుడు‘ బిరుదుతో బాలును సత్కరించారు. 2002 జనవరిలో భారత్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ టి.వి.కె. శాస్త్రి నిర్వహణలో నిర్వహించిన సిక్కోలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2019 జనవరి 4న నగరపాలక సంస్థ మైదానంలో సుమిత్ర కళాసమితి నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి బాలు, శైలజ వచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు ఆయనను ఘనంగా సత్కరించారు. గాన కోకిల సుశీల, గాయకుడు జి.ఆనంద్తో కలసి గీతాలను ఆలపించారు.
ఆదిత్యుని సన్నిధిలో కుటుంబ సమేతంగా…
ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామిని బాలసుబ్రహ్మణ్యం 2002లో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సమయంలో స్వామి పాటలను ఆల్బమ్గా చేయాలని అర్చకులు నగేష్శర్మ కోరడంతో ఆయన సూర్యాష్టకం, ఆదిత్య హృదయం స్త్రోత్రాలను పాడారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ ఆలయంలో మైక్లో వీటినే వినిపిస్తున్నారు. 2011 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రాజాం జీఎమ్మార్ ఇంజినీరింగ్ కళాశాలలో సంగీత విభావరి ఎస్పీ బాలు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన సోదరి శైలజతో పాటు వర్ధమాన గాయకులు ఇందులో పాల్గొన్నారు. జీఎమ్మార్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో సహా ప్రముఖులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఆనాటి సభలోనే
‘నేను నెల్లూరుకు చెందిన వాడినే అయినా శ్రీకాకుళం అంటే ప్రత్యేక మమకారం. ఇక్కడి ప్రజలంటే ఇష్టం’ అంటూ జిల్లాతో పాటు రాజాం ప్రాంతం గురించి గొప్పగా అభివర్ణించారు.
వర్ధమాన గాయలకు ప్రోత్సాహం
ఈటీవీలో స్వరాభిషేకం, పాడాలని ఉంది, పాడుతా తీయగా కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన వర్ధమాన గాయనీ, గాయకులు ఇప్పిలి శ్రీకాంత్, మణికంఠ, స్వాతి జగన్, రాఘవేంద్రలకు ప్రదర్శనల అవకాశం కల్పించి ప్రోత్సహించారు. ఇప్పిలి శ్రీకాంత్ను ఆయనతో పాటు అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన స్వరాభిషేకం కార్యక్రమాలకు తీసుకెళ్లారు. నగరానికి చెందిన గాయకుడు పొట్నూరు భారతీరమేష్ అన్నయ్య సీరియల్లో బాలుతో కలసి టైటిల్ సాంగ్ పాడారు.
‘మిథునం’తో వావిలవలస ప్రజలతో మమేకం
‘మిథునం’ ఎస్పీ బాలు జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. నటనలో ఎంతో కీర్తితెచ్చి పెట్టింది. అంతటి గొప్ప సినిమా చిత్రీకరణ అధికశాతం సిక్కోలు జిల్లాలోనే సాగింది. రేగిడి మండలం వావిలవలస దీనికి వేదికైంది. ఈ గ్రామానికి చెందిన మొయిద ఆనందరావు ఈ సినిమాకు నిర్మాత కావడంతో చిత్రీకరణ ఇక్కడే జరిగింది. చిత్ర నిర్మాణం 2012 జనవరి 14న ప్రారంభమైంది. స్థానికంగా ఉన్న ఓ పాత పెంకుటింటిలో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిషెడ్యూల్ 14 రోజులు, తర్వాత 15 రోజులు పలు సన్నివేశాలను తెరకెక్కించారు. దానిమూలంగా 29 రోజులు బాలు ఈ గ్రామంలోనే గడిపారు. బాలు ప్రత్యేకపాత్రలో నటుడిగా తమ ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు సంబరపడ్డారు. గ్రామస్థులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆ జ్ఞాపకాలకు తొమ్మిదేళ్లు దాటినా తమ గుండెల్లో పదిలంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు ఆ పల్లె జనం. స్థానికంగా ఉన్న గ్రంథాలయానికి వెళ్లేవారు. ఆయన ఇకలేరన్న వార్త ఆ గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు.
రాష్ట్రంలోని చిట్టచివరి జిల్లా అయిన శ్రీకాకుళంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఆబాలగోపాలం చర్చించుకుంటూ ఆయన అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలు టీవీల్లో వీక్షిస్తూ శోకతప్తహృదయాలతో నివాళి అర్పిస్తున్నారు.











