ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు పెంచడంతో ఇందులోని పాత్రధారులు వణికిపోతున్నారు. లిక్కర్ డిస్టిలరీల నుంచి కిక్బ్యాక్స్ రాజ్ కసిరెడ్డి కీలకం కాగా..డొల్ల కంపనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విదేశాలకు డబ్బు తరలించిన పాత్రధారులు మరికొంతమంది ఉన్నారు. వైసీపీ హయాంలోని ఈ మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కో రోల్. సబ్లీజ్లు, సొంతబ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు..లెక్కలన్నీ చూసేది, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు..తరలించేది మరొకరు.. ఇందులో ఆరుగురి పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి.
లిక్కర్ స్కామ్పై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కొద్దిరోజుల్లోనే వీరిలో ఐదుగురు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. ఈ ఐదుగురిలో నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ – UAE, మరొకరు థాయ్లాండ్లో ఉన్నట్లు గుర్తించారు. వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సీబీఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల ఇమిగ్రేషన్ చెక్పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసింది. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న బూనేటి చాణక్య మాత్రం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అరెస్టు అయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డి..తిరుపతికి చెందిన ఈయన ఓ కానిస్టేబుల్ కుమారుడు. ఐఐటీ ఖరగ్పూర్లో చదువుకున్న కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో డీకార్ట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి, తర్వాత మద్యం మాఫియాలోకి ప్రవేశించారు. రాజ్ కెసిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్గా వ్యవహరించారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ కంపెనీల ద్వారా రూ.కోట్ల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీ రోల్ ప్లే చేశారు. టెక్కార్ ఇన్నోవేషన్స్, ఎయిర్ ఆర్క్ స్పేస్ టెక్నాలజీస్, టెక్సిస్మార్ట్ మొబిలిటీ, డీకార్ట్ లాజిస్టిక్స్, నిరాన్ డిజైన్, టెక్కార్ టెక్నాలజీస్, కెకార్ట్ లాజిస్టిక్స్, టెక్కార్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు.
సైఫ్ అహ్మద్..సొమ్ము వసూలు చేయడంలో ఈయనది ప్రధాన పాత్ర. శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్..రాజ్ కెసిరెడ్డి సూచనలకు అనుగుణంగా డిస్టిలరీల నుంచి సొమ్ములు వసూలు చేసి, వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు, అమ్మకాల సమాచారం అంతా ఆయన చేతుల్లోనే ఉండేది. ఏ కంపెనీ నుంచి ఎంత రావాలనే లెక్కలన్నీ ఆయన దగ్గరే ఉండేవి.ఫ్లై పిజియాన్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు సైఫ్ అహ్మద్.
హైదరాబాద్కు చెందిన చాణక్య టి గ్రిల్ హోటల్ యజమాని. రాజ్ కెసిరెడ్డి ముఠా ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. అక్రమ నగదు వసూళ్లలోనూ కీలకపాత్రధారి. ఆస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పీ, వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ, సెలెర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డొల్ల కంపెనీలు నడిపారు.
పురుషోత్తం వరుణ్కుమార్ది..సికింద్రాబాద్లోని టీచర్స్ కాలనీ. లీలా డిస్టిలరీస్కు ఆంధ్రప్రదేశ్ హెడ్గా వ్యవహరించారు. డిస్టిలరీకి సంబంధించిన సబ్లీజ్లు, ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు సహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆయనే చూశారు.
బొల్లారం శివకుమార్…మద్యం మాఫియాలో కీలకమైన వ్యక్తి. అదాన్ డిస్టిలరీ డైరెక్టర్. సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి, పెద్దఎత్తున ముడుపులు పంపిణీ చేశారు. నిధుల సర్దుబాటు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ శివకుమార్ కనుసన్నల్లోనే జరిగాయి. వైట్ డీర్ స్పిరిట్స్ డిస్టిలరీస్ LLP, అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన అవినాష్రెడ్డి..రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు. మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అదాన్ డిస్టిలరీ, అనుబంధ సంస్థలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాల్లో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ LLP పేరుతో డొల్ల కంపెనీ నడిపారు.











