కొండను తవ్వి ఎలుకలను పట్టిన చందంగానే డ్రగ్స్ కేసు తయారైంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎన్సీబీ డ్రగ్స్ మీద దృష్టి సారించింది. సుశాంత్ ప్రియురాలు రియాతో మొదలైన ఈ డ్రగ్స్ కేసులో ఎంతోమంది బాలీవుడ్ నటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హీరోలు, దర్శకులు లాంటి సెలబ్రిటీల పేర్లు వినిపించినా కేవలం నటీమణుల మీదే ఎన్సీబీ దృష్టిపెట్టిందన్న ఆరోపణలు ఒకదశలో బలంగా వినిపించాయి. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. ఆ ఫోన్ల రికార్డింగులు, ఛాటింగుల ఆధారంగా చాలామందిపై ఉచ్చు బిగించి వారిని పిలిపించి విచారించింది. అలా రియాతో పాటు దీపికా పదుకొనే, శ్రద్ధ, సారా, రకుల్.. లాంటి వారందరినీ విచారించింది.
ఎంతో వాడివేడిగా సాగిన ఈ డ్రగ్స్ కేసు విచారణ ఒక్కసారిగా చల్లారిపోయింది. దీని ఆంతర్యం ఏమై ఉంటుందన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. క్రమేపీ ఈ కేసులో పెద్ద తలకాయలు బయటపడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో కేసు ఒక్కసారిగా చల్లారిపోయింది. ఇంతకుముందు టాలీవుడ్ లో జరిగిన కేసు విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. రాజకీయ ఒత్తిడి పనిచేసిందా, వేరే ఇంకేమైనా ప్రలోభాలు కారణమయ్యాయా? అనే అనుమానాలు జనంలో తలెత్తాయి. ఈ కేసులో ఇరుక్కున్న రియాకు బెయిల్ వచ్చేసింది. శాండల్ వుడ్ తారలకు మాత్రం ఇంకా ఉపశమనం లభించలేదు. డ్రగ్స్ దాదాపు మరుగున పడిపోయినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
దర్యాప్తులో ఫోన్ డేటానే కీలకం
ఈ డ్రగ్స్ కేసులో సెల్ ఫోన్ డేటా కీలకంగా మారింది. అసలు ఎఫ్.ఐ.ఆర్. లో నిందితులుగా పేర్లు చేర్చుకుండా ఎన్సీబీ అధికారులు వీరి ఫోన్లను స్వాధీనం చేసుకోవచ్చా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ కేసులో నిందితులుగా లేని దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ల ఫోన్లను కూడా ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది.
ఎఫ్ఐఆర్లో రియా చక్రవర్తి, జయషాలను మాత్రమే నిందితులుగా పేర్కొంది. సి.ఆర్.పి.సి. సెక్షన్ 102 ప్రకారం మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా ప్రైవేట్ డైరీని లాంటివి కేసు దర్యాప్తు నకు సహకరిస్తాయంటే పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు. ఆ ప్రకారమే రియా, జయషా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే వారు ఈ కేసులో నిందితులు. నిందితులుగా లేని దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ఫోన్లను కూడా వారు స్వాధీనం చేసుకోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. వీరు కేవలం దర్యప్తులో ఉన్నవారు మాత్రమే. దర్యాప్తులో కీలకంగా భావించే ఏ వస్తువునైనా స్వాధీనం చేసుకునే హక్కు సీఆర్పీసీ సెక్షన్ 102 ఇస్తోంది. అయితే ఇది పోలీసులతో ముడిపడిన కేసు కాదు. టెక్నికల్ గా చూస్తే ఈ దర్యాప్తు పోలీసులు లేని ఎన్సీబీ చేతిలో ఉంది. కాకపోతే ఎన్డీపీఎస్ చట్టం నుంచి సెర్చ్ అండ్ సీజర్ అధికారాలు ఎన్సీబీకి వస్తాయి. అయితే ఇలాంటి సమాచారం బయటికి లీక్ కాకూడదు.
తన డేటా లీక్ అవుతోందని ఎవరైనా భావిస్తే తమ పరువుకు నష్టం కలిగించే వాటిని నిరోధించాలని కోరుతూ ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టుకు కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి కాబట్టి దర్యాప్తు సంస్థలు వీటిని స్వాధీనం చేసుకుంటాయి. ఇవన్నీ ఈ కేసుకు సంబంధించిన టెక్నికల్ విషయాలు. ఇలాంటి వాటిపై కూడా కొందరు కోర్టులో సవాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు చల్లారిపోయింది కాబట్టి దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. మొత్తానికి ఏవో అదృశ్య శక్తులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.











