ఏపీ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ అంశం సెగ రాజేసింది. ప్రతిపక్ష, మీడియా, న్యాయమూర్తుల ఫోన్లను అధికార పార్టీ ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానికి లేఖ వ్రాయడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. దీనిపై ఏపీ డీజీపీ విచారణ జరుపుతామని ముందుకు రావడంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు ట్యాపింగ్ అంశం కొత్త కాదని గత ప్రభుత్వ హయంలో కూడా జరిగేదని చెప్పుకొచ్చారు. అందుకు ఆయన చెప్పిన రుజువుల విషయంలోనే అందరికి అనుమానం నెలకొంది. ఒక్కప్పుడు టీడీపీ నాయకుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్న నాయకుడితో మాట్లాడే విషయం అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఐబీ వెంకటేశ్వర రావుకు తెలిసిందని ఆయన అన్నారు. ఇదే విషయాన్నీ వెంకటేశ్వర రావు అప్పటి టీడీపీ నాయకుడిని కూడా అడిగాడని దీంతో తాము వేరే ఫోనులతో మాట్లాడుకునే వాళ్లమని తెలిపారు.
ఇంకో సందర్భంలో తన చిన్ననాటి మిత్రుడు అప్పడప్పుడు ఫోను చేసేవాడని ఆ విషయం కూడా ఇంటలిజెన్స్ చీఫ్ కు తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ మిత్రుడు మావోయిస్టు అని అతనితో జాగ్రత్త అని వెంకటేశ్వర రావు తనను హెచ్చరించాడని గుర్తు చేశాడు. ఈ విషయాలను ట్యాపింగ్ ద్వారానే వారికి తెలిసిందని వీర్రాజు అభిప్రాయపడ్డాడు. మరో అడుగు ముందుకేసి చిన్నబాబు అప్పటి చీఫ్ ద్వారా పరికరాలను తెప్పించి ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శలు చేశారు. ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యత నాయకుల భద్రత. నాయకులను భద్రత విషయంలో హెచ్చరించడం అతని విధి. సరే ఇది తప్పే అనుకుందాం మరి గత ప్రభుత్వంలో జరిగిన ఈ ఉదంతాన్ని అప్పుడు కాకుండా ఇప్పుడు చెప్పడమేంటని అందరూ ఆశ్చర్య పోతున్నారు.
ట్యాపింగ్ జరిగిందనే అనుమానం ఉన్నా టీడీపీతో పొత్తు ఉందనే ఉద్దేశంతో వీర్రాజు గొంతు మెదపలేదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ లాంటి సున్నిత విషయంలో ఆయన స్పందించిన తీరు కూడా సరిగా లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే సోము వీర్రాజు దూకుడు ప్రదర్శిస్తున్నారు. బీజేపీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కొరడా జులిపించిన ఆయన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీని ఫినిష్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన జవాబిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని 1998 నుంచి చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నారని తెలిపిన ఆయన 7.5 శాతం ఓటింగ్ ఉన్న బీజేపీని సున్నా శాతానికి తీసుకువచ్చింది కూడా ఆయనే విషయాన్ని తెలియచేశారు.
బీజేపీ పతనానికి కారణమైన చంద్రబాబును ఏనాడైనా ఈ ప్రశ్న అడిగారా అంటూ ఆయన మీడియాను ఎదురు ప్రశ్న వేశారు. చంద్రబాబు వేసిన ప్రతి అడుగు తనకు తెలుసని ఆ దారిలోనే వెళ్ళి టీడీపీకి చెక్ పెడతామని ధీమాను వ్యక్తం చేశారు. 23 మంది వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబును ఒక్క ప్రశ్న కూడా అడగని మీడియా ప్రస్తుతం బీజేపీని తప్పుపట్టరాదని హితవు చెప్పారు. చంద్రబాబుకు మీడియా మద్దతు ఉందని అభిప్రాయ పడ్డ ఆయన బీజేపీని రాష్ట్రంలో బలమైన పార్టీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడించాడు.