సంపూర్ణ మద్యనిషేధం అనేది జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ. ఆ రకంగా, ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేలా, మహాత్మా గాంధీ స్వప్నాన్ని మన రాష్ట్రంలో సాకారం చేస్తానని ఆయన మాట ఇచ్చారు.
సంపూర్ణం అనగా.. చాలా పరిమితంగా మాత్రం అనుమతిస్తూ నిషేధం తెస్తానని తర్వాతి కాలంలో క్లారిటీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. పాలన మొదలైన తర్వాత మద్యం దుకాణాల సంఖ్య తగ్గించినా, ధరలు పెంచినా అన్నీ.. నిషేధం దిశగా పడుతున్న అడుగులే అని ప్రజలు అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అబ్కారీ పన్నులే అతిపెద్ద ఆదాయవనరుగా మారిపోయిన పరిస్థితుల్లో- మద్యనిషేధాన్ని ఇష్టపడే వాళ్లు- జగన్ తీసుకుంటున్న చర్యలను సాహసంగానే భావిస్తూ, అభినందించారు.
ఏపీలో కొవిడ్ కాలంలో కొన్నాళ్లు మద్యం దుకాణాల్ని మూసి ఉంచిన తర్వాత.. లిక్కర్ రేట్లు మళ్లీ పెరిగాయి. ప్రజలకు అలవాటు అయిన బ్రాండ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఊరూ పేరూ తెలియని చీప్ బ్రాండ్లను అత్యధిక ధరలకు కొనాల్సిన అగత్యం ఏర్పడింది.
ఈ పరిణామాలపై.. జగన్మోహన్ రెడ్డి తన అనుకూలురైన లిక్కర్ తయారీదార్లకు అనుచిత లబ్ధి చేకూర్చడానికే.. పాపులర్ బ్రాండ్లు దొరకని పరిస్థితి సృష్టించి, చీప్ బ్రాండ్లను మాత్రమే విక్రయించేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి గానీ.. నిషేధాన్ని కోరుకునే వారు మాత్రం.. ఆ దిశగా ఇది కూడా మరొక అడుగు అనే అనుకున్నారు.
విపరీతంగా పెరిగిన స్మగ్లింగ్
రెండోదశలో- పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ బీభత్సంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అన్ని సరిహద్దు ప్రాంతాలను లెక్కలోకి తీసుకుంటే ప్రతిరోజూ కొన్ని లక్షల రూపాయల విలువైన మద్యం స్మగ్లింగ్ అవుతూ పోలీసులకు పట్టుబడుతూనే ఉంది. ఇది దొరుకుతున్న లిక్కర్ విలువ మాత్రమే. అంటే పోలీసుల కంటపడకుండా.. మరెన్ని లక్షల, కోట్ల రూపాయల విలువైన మద్యం ఏపీలోకి స్మగుల్ అవుతోందో తెలియదు. ఈ స్మగ్లింగ్ దందాల్లో దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులూ ఉంటున్నారు. రాజకీయం అంటేనే తప్పుడు మార్గాల్లో ఆర్జించే వారికి ఒక కవచం లాంటి అడ్డాగా నిర్వచనాలు మారిపోతున్న ఈ రోజుల్లో.. నేతలు అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఒక బీజేపీ నేత స్వయంగా స్మగుల్ చేస్తూ దొరికారు. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీచేసిన గుడివాక రామాంజనేయులు (అంజిబాబు) తెలంగాణ నుంచి లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ఆయన్ని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దుర్గ గుడి ధర్మకర్తల మండలి సభ్యురాలు చుక్కా నాగవరలక్ష్మి కారులో కేసులకొద్దీ లిక్కర్ పట్టుబడింది. ఆమె దుర్గగుడి బోర్డు పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి దృష్టాంతాలు అనేకం వెలుగుచూశాయి.
ఈ క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం స్మగ్లింగ్ మీద కోట్లు ఆర్జించేస్తున్నారని, సరిహద్దు పోలీసులతో వైసీపీ నాయకులకు దోస్తీ కుదిరిందని.. వారు వారు కుమ్మక్కయి లిక్కర్ దందాలు నడిపిస్తున్నారని కూడా గంపగుత్తగా బోలెడు ఆరోపణలున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం వస్తుందేమో అని జగన్ నిర్ణయాలు చూసి ఆశపడుతున్న వారు.. ఇలాంటి ఆరోపణలు రాజకీయమైనవే తప్ప.. పార్టీకి అంటగట్టడం కరెక్టు కాదని, ఏదో కొందరు వ్యక్తులు అలా చేస్తుండవచ్చునని అనుకుంటూ వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు.
‘శానిటైజర్ మరణాలు’ వింత!
కొవిడ్ ప్రబలడం, దానితోపాటుగా శానిటైజర్లు విస్తృతంగా అందుబాటులోకి రావడం.. అది ప్రజల అవసరంగా మారడం నేపథ్యంగా.. వచ్చిన దుష్పరిణామం శానిటైజర్ తాగి పేదలు మరణించడం అనేది! రాష్ట్రంలో ఆగస్టు నాటికి కనీసం 36 మంది శానిటైజర్ తాగి మరణించినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదు అయ్యాయి. ఇవి నమోదైన కేసులద్వారా వచ్చిన గణాంకాలు మాత్రమే. సామూహిక మరణాలు సంభవించిన సందర్భాల్లో రికార్డు అయిన గణాంకాలు మాత్రమే. ఒక్కొక్కరుగా చచ్చిపోతే అవేవీ పెద్దగా గణాంకాల్లోకి ఎక్కకపోయి ఉండొచ్చు. మొత్తంగా ఈ ఖాతాలో వంద మరణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు.
ఇవన్నీ శానిటైజర్ మరణాలే అని అందరూ అంటారు. కానీ.. వాస్తవంలో నాటు సారా తయారీ రాష్ట్రంలో పెరిగిందని, ఎక్సైజు అధికారులు పట్టించుకోవడం మానేశారని లేదా కుమ్మక్కయ్యారని, నాటుసారా వినియోగం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఒక వాదన కూడా ఉంది. ఈ వాదన నమ్మదగినదే. ఎందుకంటే- శానిటైజర్ సామూహిక మరణాలు సంభవించిన కొన్ని సందర్భాల్లో వారి ఇళ్ల వద్ద పదుల సంఖ్యలో ఖాళీ శానిటైజర్ సీసాలను చూపించి, వారికి శానిటైజర్ తాగే అలవాటు ఉన్నట్టుగా ‘సృష్టింపబడే’ సాక్ష్యాలు పోలీసు రికార్డులకు ఉపయోగపడవచ్చు గానీ.. ప్రజలకు మాత్రం వెటకారంగా అనిపిస్తాయి. అంటే నాటు సారామరణాలు బయటపడిన ప్రతిసారీ.. వాటిని శానిటైజర్ మరణాలుగా చిత్రించడానికి ప్రభుత్వ పెద్దలు, పోలీసులు తమ శక్తిమేర ప్రయత్నించారనడంలో ఎంతో కొంత నిజం ఉంది.
ఇటీవలి కాలంలో శానిటైజర్ మరణాల ఉధృతి తగ్గింది గానీ.. నాటు సారా తయారీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. కొన్ని కేసులు క్రమంతప్పకుండా ప్రతిచోటా బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మద్యనిషేధం కోసం తీసుకుంటున్న చర్యలు.. పరోక్షంగా నాటు సారా తయారీకి కారణమయ్యాయి. ఆ దందాను పెంచిపోషిస్తున్నాయి. ‘‘రాష్ట్రంలో నాటు సారా తయారీ లేనేలేదు, ఇదంతా మద్యనిషేధం కోసం, గాంధీజీ కలల్ని సాకారం చేయడం కోసం జగన్మోహన రెడ్డి తీసుకుంటున్న మంచి పనులు చూసి ఓర్వలేని వారు చేస్తున్న దుష్ప్రచారం’’ తరహా డైలాగులు అధికార పార్టీ నుంచి వినిపిస్తే ఆశ్చర్యం లేదు.
అలాంటి వారు.. ఇప్పుడేమంటారు?
అలా సమర్థించుకునే వారుంటే.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బయటపడిన సంఘటన నేపథ్యంలో ఏమంటారో చూడాలి? శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలోని సూదికొండ కాలనీ కోతి సింహాచలం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సింహాచలం, అతని కొడుకు ఆదినారాయణ ఇద్దరిపై అదే ప్రాంతానికి చెందిన ప్రత్యర్ధులు కత్తులు,కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సింహాచలం ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇంతకూ ఈ హత్యకు కారణం ఏంటో తెలుసా? ఫ్యాక్షన్ తగాదాలు గానీ, అక్రమ సంబంధాలు గానీ కాదు. నాటు సారా విక్రయాల్లో ఇరు వర్గాల మధ్య గొడవ రేగింది. ఇరు వర్గాలూ నాటు సారా కాసి అమ్ముకునే వాళ్లే. వారి తగాదా.. ఒక ప్రాణం తీసింది. పోయిన ప్రాణం దాగిన గుట్టును బయటకు తెస్తోంది. రాష్ట్రంలో నాటుసారా తయారీ అనేది విశృంఖలంగా ఉన్నదనే గుట్టు బయటపెడుతున్న దుర్ఘటన ఇది.
‘‘రాష్ట్రంలో ఒక మూల ఒక సంఘటన జరిగితే.. రాష్ట్రానికంతా దానిని ఆపాదిస్తారా.. ఇది కుట్ర’’ అని ఎవరైనా గేలిచేయచ్చు, గోల చేయవచ్చు. కానీ, ఇది వాస్తవం. నాటుసారా తయారీ విశృంఖలంగా ఉన్న మాట నిజం. ఎక్సయిజ్ కేసులు ప్రతిచోటా నమోదు అవుతూనే ఉన్నాయి. ఆ శాఖ గణాంకాలు చూసినా ఆ సంగతి విపులంగా అర్థమవుతుంది.
ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పుపట్టలేం
నాటుసారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది గనుక.. దాఖలాలు దొరుకుతున్నాయి గనుక.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు పూర్తి బాధ్యత వహించాల్సిందే అని నిందించడానికి కూడా వీల్లేదు. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటూనే ఉంది. వాటి ప్రభావం కూడా ఎంతో కొంత కనిపిస్తూనేఉంది.
లిక్కర్ ధరల పెంపు, తదితర నిర్ణయాల ప్రభావం.. నాటుసారా తయారీకి దారితీస్తున్న నేపథ్యంలో ఎక్సైజు శాఖనే జగన్ దాదాపుగా రెండు ముక్కలుగా చేశారు. ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ఏర్పాటుచేశారు. ఐడీ (ఇల్లిసిట్ డిస్టిల్డ్ లిక్కర్) అని ఎక్సైజు పరిభాషలో చెప్పుకునే నాటుసారా తయారీని, ఇసుక అక్రమ దందాలను అడ్డుకోవడం ఈ ఎస్ఇబి పని. ఇసుక దందా కేసులు వారు పట్టుకున్నా, తర్వాత వాటిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తారు. నాటుసారా తయారీపై వారే కేసులు నమోదు చేస్తారు. ఈ ఏడాది మే 16న ఈ ఎస్ఇబి ఏర్పాటు అయింది. దీనికింద ప్రతి జిల్లాకు ఒక ఎడిషనల్ ఎస్పీని కూడా ఇన్చార్జిగా నియమించారు. అప్పటినుంచి కొంతవరకు నాటు సారా తయారీ కట్టడి అయిందనే చెప్పాలి. కానీ ఇప్పటికీ విశృంఖలంగా జరుగుతూనేఉంది. ఒక జిల్లాలో నెలకు సగటున వందకు పైగా నాటు సారా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కడప జిల్లాలో కొంత తక్కువగానే ఉంది గానీ, కర్నూలు, చిత్తూరు, గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాటు సారా తయారీ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి.
ఇప్పుడు సిక్కోలు హత్య నేపథ్యంలో అసలు ఈ నాటు సారా తయారీ దందాలను ఒకసారి సమీక్షించుకోవాల్సి ఉంది. నాటుసారా వల్ల తాగిన వారు చచ్చిపోవడమే కాదు, తయారుచేసే వారు చచ్చిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం మరింత కఠినంగా చర్యలు తీసుకుని ఈ అరాచకాల్ని అడ్డుకోవాలి. నాటుసారా కంటె ఎక్కువగా, సంపూర్ణ మద్యనిషేధం అనే జగన్మోహన్ రెడ్డి స్వప్నానికి తూట్లు పొడుస్తున్న లిక్కర్ స్మగ్లింగ్ ను కూడా మరింత సమర్థంగా కట్టడి చేయాలి.
.. సురేష్ పిళ్లె











