టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారా? లేదంటే జమిలి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయా? అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి కరక్టే అనే సమాధానం వస్తోంది. టీడీపీలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక నేతను ఇన్ ఛార్జిగా నియమించడం ఇలాంటి వాదనలను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీలో కొత్త పదవులు భర్తీ చేశారు. స్థానిక ఎన్నికలతో పాటు, జమిలి ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసేందుకే పార్టీ అధినేత కొత్త బాధ్యతలు పంచారని తెలుస్తోంది. వచ్చే ఏడాది గ్యారంటీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తరవాత ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయని టీడీపీ అధినేతకు సంకేతాలు అందాయని తెలుస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేస్తున్నారని అనుకుంటున్నారు.
ఎవరికి ఏ పదవులు ఇచ్చారంటే?
టీడీపీలో ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న 9 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు ఒకరిని ప్రత్యేక ఇన్ ఛార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు బాధ్యతలు పంచుమర్తి అనురాధకు ఇచ్చారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల బాధ్యతలు టీడీపీ సీనియర్ నేత చెంగల్రాయుడికి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట బాధ్యతలు అనగాని సత్యప్రసాద్ కు అప్పగించారు. ఇక మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కూడా టీడీపీ అధినేత బీసీలకు పెద్దపీట వేశారు. ఐదుగురిలో రెండు కీలక పదవులు బీసీలకు అప్పగించారు.
సమన్వయం, పర్యవేక్షణ
టీడీపీలో దేవినేని ఉమకు మంచి పదవి దక్కలేదని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి పార్టీ అధినేత తాళం వేశారు. స్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతలు దేవినేని అప్పగించారు. ఇక పయ్యావుల కేశవ్ కు పార్టీ అధికార ప్రతినిధులను పర్యవేక్షించే పని అప్పగించారు. ఇక ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి 25 లోక్సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే బాధ్యత అప్పగించారు.
అన్నివర్గాలకు ప్రాధాన్యం
తాజాగా ప్రకటించిన పదవుల్లోనూ ఎస్సీలు, ఓసీలు, బీసీలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. టీడీపీ అధినేత ఎన్ని పదవులు ఇచ్చినా ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారని తప్పనిసరిగా చూస్తారనే పేరుంది. తాజాగా ప్రకటించిన పదవుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసి టీడీపీ అంటే బీసీ పార్టీ అని నిరూపించుకునే ప్రయత్నం చేశారనిపిస్తోంది. అయితే టీడీపీ అధినేత తాజాగా ప్రకటించిన పదవులు కేవలం స్థానిక ఎన్నికల పర్యవేక్షణకే కాకుండా, జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేశారనే ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా పదవులు దక్కిన నేతలు ఖుషీగానే ఉన్నారని తెలుస్తోంది.