‘దిగి రావాలని ధరలు.. దిగిపోవాలి జగన్’..!
ధరలు దిగి రావాలంటే.. జగన్ రెడ్డి దిగిపోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఏపీ వ్యాప్తంగా టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టింది. 13 జిల్లాలోని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ఆందోళనకు దిగారు. పక్కనున్న తమిళనాడు ప్రజలకు 21 నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంటే.. ఏపీ లో గత రెండునరేళ్ల నుంచి సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలని తీసేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రజలకు ఆదాయం తగ్గుతుంటే.. నిత్యవసరాలన్నీ 100, 200 శాతం పెరిగాయని వాపోయ్యారు. తక్షణమే ధరలను తగ్గించి, సామాన్యుడికి అందుబాటలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు ఇలా ..
కర్నూలు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిత్యావసర వస్తువుల ధరలపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి నేతృత్వంలో బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, స్థానిక ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలానే నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో టీడీపీ మహాధర్నాకు దిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొని అధికారపార్టీ పోకడలను ఖండిచారు. విశాఖలో నిత్యావరస వస్తువుల ధరల పెంపుపై టీడీపీ ఆందోళన చేపట్టింది. విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలపై నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి, సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెరిగిన నిత్యావరస సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని కాకినాడ సిటీ టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. చిరుధాన్యలను, కూరగాయాలను మెడలో ధరించి, ధర్నాకు దిగారు. అలానే రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో పార్క్ సెంటర్లో వంటవార్పు నిర్వహించారు. ఇలా పెరుగుతున్న నిత్యావసరాలపై టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి.











