తిరుపతి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని నిలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. గతవారం ఉండవల్లి నివాసంలో పలువురు పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అనే దానిపై మీడియాలో వస్తున్న కథనాలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బ్రేక్ వేశారు. తిరుపతి నుంచి టీడీపీ పోటీ చేస్తుందని మాత్రమే కాదు, అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి అధికార వైసీపీకి సవాల్ విసిరారు.
తిరుపతి బరిలో తేల్చుకుంటాం…
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిగితే అక్కడ వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబునాయుడు తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైందని తెలుస్తోంది. అందుకే అందరికంటే ముందుగానే తిరుపతి అభ్యర్థిని ప్రకటించారు. తిరుపతిలో ఎవరు పోటీ చేస్తే విజయం దక్కుతుందనే విషయంపై చేసిన సర్వేలో కూడా పనబాక లక్ష్మి పేరు ముందు వరుసలో నిలిచిందని తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకునే వారం రోజులు తీవ్ర కసరత్తులు చేసిన టీడీపీ అధినేత తిరుపతి పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించడం అధికార పక్షానికి సవాల్ విసిరినట్టయింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.