తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్సభ స్థానానికి ఏప్రిల్ 17 జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. ఏప్రిల్ 3వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఎన్నికలకు సాగర్లో మొత్తం 52 నామినేషన్లు అందగా, తిరుపతికి సంబంధించి 26 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తిరుపతిలో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వారం ముందుగానే నామినేషన్ దాఖలు చేశారు. నాగార్జునసాగర్లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ, టీడీపీ పార్టీల అభ్యర్థులు కూడా మంగళవారమే నామినేషన్లు దాఖలు చేశారు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి సాగర్లో మొత్తం 28 నామినేషన్లు దాఖలు చేయగా తిరుపతిలో 12మంది నామినేషన్ వేశారు. మిగతావారు స్వతంత్ర అభ్యర్థులుగా ఉండనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హత పొందిన సంఖ్యపై క్లారిటీ రానుండగా ఏప్రిల్ 3వరకు ఉపసంహరణ ఉంది. ఏప్రిల్ 3 తరువాత ఎంతమంది బరిలో ఉన్నారనేది తేలనుంది.
అభ్యర్థులు వీరే..
తిరుపతి లోక్సభకు వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ నుండి పకబాక లక్ష్మీ, బీజేపీ-జనసేన నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుండి చింతా మోహన్, సీపీఎం నుంచి యాదగరి నామినేషన్లు దాఖలు చేయగా నాగార్జునసాగర్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, బీజేపీ నుంచి డా. రవి నాయక్, టీడీపీ నుంచి మొవ్వ అరుణ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు.
జానా 11వ సారి..
కాగా ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే…కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 11వ సారి నామినేషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల వరకు ఆయన 10సార్లు నామినేషన్లు దాఖలు చేశారు. మూడుసార్లు ఓడిపోయారు. 7 సార్లు గెలిచారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవి నాయక్ , టీడీపీ అభ్యర్థి మొవ్వ అరుణకుమార్ తోపాటు పలువురు తొలిసారిగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతిలో పనబాక లక్ష్మి గతంలో నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నుంచి గురుమూర్తి తొలిసారిగా నామినేషన్ దాఖలు చేశారు.
సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు..
నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నోముల నర్సింహయ్య, తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్లు చనిపోవడంతో ఆ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనుండగా మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రయత్నాలు చేస్తుండగా ఈ స్థానాల్లో గెలిచేందుకు బీజేపీ కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఏపీలో ప్రతిపక్షమైన టీడీపీ కూడా సాగర్, తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Must Read ;- జనసేన కటీఫేనా.. తిరుపతిలో బీజేపీ ఒంటరి పోరేనా











