తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో షాక్ తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు దాదాపు లేనట్టేనని చెప్పవచ్చు. ఆరో రౌండ్ పూర్తయ్యే సమయానికి.. తొలి స్థానంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండగా స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిసురభీ దేవి, బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి మధ్య పోటీ నెలకొంది.
గత ఎన్నికల్లో..
గతంలో జరిగిన ఎన్నికల్లో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి ఇ. రామ్మోహన్ పోటీ చేశారు. ఇప్పటితో పోల్చితే అప్పటి ఓటర్ల సంఖ్య దాదాపు 50శాతమే అని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 11,323 ప్రాధాన్య ఓట్లతో గెలవగా రెండో ప్రాధాన్య ఓటు గెలు పోటములు నిర్ణయించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఇ.రామ్మోహన్ రెండో స్థానంలో నిలవగా తీన్మార్ మల్లన్న మూడో స్థానంలో నిలిచారు. అయితే 2019లో లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో దూకుడు మీదున్న బీజేపీ టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు మొదలు పెట్టింది. తామే ప్రత్యామ్నాయని చెబుతోంది. దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీలో భారీగా డివిజన్లను కైవసం చేసుకున్న బీజేపీ.. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుస్తామని చెప్పింది. అయితే ఆ వ్యాఖ్యలకు బ్రేక్ పడిందనే చర్చ మొదలైంది.
Must Read ;- ఎమ్మెల్సీ కౌంటింగ్లో 50 ప్లస్ వన్ ఫార్ములా.. అందుకే ‘ప్రాధాన్యత’ ప్రాణప్రదం
ఇక బీజేపీ పట్టుపెంచుకునే అంశాన్ని పక్కన బెడితే.. ఇప్పటికి ఉన్న పట్టును నిలుపుకోవాలంటే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో గెలవడం ఒక్కటే ఆ పార్టీకి ఉన్న అవకాశంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు రెండో స్థానంలో కొనసాగుతున్నారు. పీవీ నరసింహారావు కుమార్తె వాణి సురభీ దేవిని అనూహ్యంగా తెరపైకి తెచ్చిన టీఆర్ఎస్.. ఓటర్లను ఆకట్టుకుందని చెప్పవచ్చు. పోటీ మాత్రం హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ స్థానంలో గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. ఇక్కడ బీజేపీ గెలిస్తే.. అధికార పార్టీపై విజయం సాధించామని చెప్పినా.. సిట్టింగ్ సీటను కాపాడుకున్నట్లు భావించవచ్చు. ఒక వేళ ఓడితే బీజేపీకి కొంత ఎదురుదెబ్బగా భావింవచ్చు.
పోల్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్..
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం ఒక ఎత్తైతే పోల్మేనేజ్మెంట్ కూడా ముఖ్యంగానే మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా అన్ని విధాలుగా విఫలం అయిందని చెప్పవచ్చు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే..ప్రతి 25 మంది ఓటర్లకు ఒక కమిటీని వేసింది. అధికార టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి , మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ రంగంలోకి దిగారు. ప్రతి ఓటరును ఫోన్లో టచ్ చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే.. అభ్యర్థుల ప్రచారం పక్కన బెడితే..పార్టీ ప్రచారం రెండు విడతలుగా జరిగిందని చెప్పవచ్చు. అదే సమయంలో నిరుద్యోగులను శాంతింపజేసే యత్నం, బీజేపీ వైఫల్యాలు, ఉద్యోగాల కల్పన, శాంతిభద్రతలు అంశాలను టీఆర్ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లింది. టీఆర్ఎస్ గెలిచినా..ఓడినా.. ఓటర్ని పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అదే సమయంలో బీజేపీ మాత్రం టీఆర్ఎస్పై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పవచ్చు. కేంద్రం ఏం చేసిందనే అంశంపై స్పష్టత ఇచ్చిన దాఖలాల్లేవు. ఇక్కడ బీజేపీ గెలిస్తే.. అది టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుగానే భావించాల్సి ఉంటుందని, ఓట్ల చీలిక , సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూనివర్సిటీల విద్యార్థుల ఓటు బీజేపీ వైపు మళ్లడం కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రతి 45మంది ఓటర్లకు ఓ కమిటీ వేసి ప్రచారం చేసిన బీజేపీ.. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్లో మాత్రమే రేసులో ఉందని చెప్పవచ్చు.
ముంచుతున్న చెల్లని ఓట్లు..
కాగా ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఆందోళన కలిగిస్తోన్న అంశం మరొకటి ఉంది. అవే చెల్లని ఓట్లు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో మూడు రౌండ్లకే చెల్లని ఓట్ల సంఖ్య 10,082గా తేలింది. గత ఎన్నికల్లో కౌంటింగ్ మొత్తం పూర్తయ్యాక చెల్లని ఓట్ల సంఖ్య 14,089. అయితే ఈ సారి మూడో రౌండ్కే 10,082చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఆ రౌండ్ ప్రకారం చూస్తే మొత్తం లెక్కించిన ఓట్లలో చెల్లని ఓట్లు 6% గా నమోదు కావడంతో అధికారులే షాక్ తినాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు 6శాతం ఉండడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. కొంతమంది నెంబరుతో పాటు అక్షరాలు రాయడం, టిక్ మార్కు పెట్టడం లాంటివి చేశారు. ఈ విషయంలో అవగాహన కల్పించే విషయంలో పార్టీలతో పాటు వ్యవస్థలూ విఫలం అయ్యాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read ;- నియామకాలే అజెండా.. నిరుద్యోగులపై పార్టీలకెంత ప్రేమో!











