ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్మన్లను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని శాలువాలు కప్పి, బొమ్మలు ఇచ్చినా వారు అప్పులు మాత్రం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్డినెన్సె ద్వారా బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని గుర్తు చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు వివరాలు బయటకు వస్తాయని సీఎం భయపడుతున్నారని రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
వచ్చే నెల జీతాలు కూడా కష్టమే..
వచ్చే నెల అంటే మరో రెండు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదని రఘురామరాజు గుర్తు చేశారు. అప్పులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్పీవీలు కూడా పనిచేయవని ఆయన అన్నారు. అప్పులు ఇచ్చేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదని రఘురామరాజు తెలిపారు. ఇక తిరుపతి వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అక్రమంగా విదేశాలకు తరలించి అమ్ముకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించినా..
సీఎం బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించినా దానిపై సమగ్రంగా విచారణ జరపకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుల ఆంధ్రప్రవేశ్ కాస్తా, సీఎం జగన్ దివాళాంధ్రప్రదేశ్గా మార్చాడంటూ రఘురామరాజు సెటైర్లు వేశారు.
Must Read ;- వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం.. ప్రధానికి ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు