టీవీ ఛానెల్స్ మధ్య పెరిగిపోతున్న పోటీతత్వానికి తట్టుకొని నిలబడేందుకు కొన్ని ఛానల్స్ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నకిలీ టిఆర్పీ రేటింగ్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించారు పోలీసులు. నకిలీ టిఆర్పీ రేటింగ్ స్కామ్ను ముంబై పోలీసులు బయటపెట్టారు.
ఆరోపణలను తిప్పికొట్టిన రిపబ్లిక్..
ముంబాయి పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నకిలీ టిఆర్పీ రేటింగ్ గురించి పలు విషయాలు వెల్లడించారు. అయితే రిపబ్లిక్ టీవి ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈనేపథ్యంలో ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సినీనటుడు సుశాంత్ కేసులో తాము ప్రశ్నలు సంధించినందుకే ముంబాయి పోలీస్ కమిషనర్ పరమ్వీర్ రిపబ్లిక్ టీవిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అతనిపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. బార్క్.. ఇంత వరకూ ఒక్క ఫిర్యాదులో కూడా తమ పేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు. పరమ్వీర్ సింగ్ క్షమాపణలు చెప్పి, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని ఆయన ఆరోపించారు.
టీవీ,డబ్బులిచ్చి…
టిఆర్పీ రేటింగ్స్ పెంచేందుకు ఏకంగా ప్రజలకు డబ్బులు ఇచ్చి తమ ఛానల్ మాత్రమే చూసేలా మీటర్స్ని అమర్చి అధిక రేటింగ్ పొందుతున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. రెండు ఛానల్స్తోపాటు ఓ జాతీయ మీడియా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ వ్యవహారంలో బార్క్ సంస్థ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ తెలిపారు. బార్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫేక్ రేటింగ్ వివరాలను పోలీసులు బయటపెట్టారు. కేవలం ఒకే ఛానల్ చూస్తామని చెప్పిన వారికి టీవితో పాటు కొంత మేర నగదును కూడా ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.