రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించిన దుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. ప్రచార హోరు , మాటల తూటాలు.. బాహాభాహీల మధ్య సాగిన ఉప ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న జరిగిన ఘటన తో ఏదైనా అల్లర్లు జరుగుతాయని భావించినా అలాంటి ఘటనలు ఏవీ జరగలేదని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది.
ఉప ఎన్నిక పూర్తైనా ఇంక ఫలితాల కోసం వారం రోజులు ఆగాల్సి ఉంది. పార్టీలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 82శాతానికి పైగా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే గత ఎన్నికల కంటే ఒక శాతం అదనంగా పోలింగ్ జరగడంతో అధికార పార్టీ ఇది తమకే లాభిస్తుందని భావిస్తోంది.
పెన్షన్ దారులు.. రైతులపైనే ఆశపెట్టుకున్న టీఆర్ఎస్..
ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకుంది. ప్రచారంలో బీజేపీ , కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగట్టిన ఆ పార్టీ నేతలు జాతీయ పార్టీలతో దుబ్బాకకు వచ్చేది ఏమీలేదంటున్నారు. స్థానికంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, స్వయంగా ఆర్థిక మంత్రి హరీష్ రావులే దుబ్బాక ప్రజలకు అండగా ఉంటారంటూ ప్రచారం చేసింది టీఆర్ఎస్.
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ భిల్లుతో పాటు త్వరలో తీసుకు రాబోతున్న విద్యుత్ బిల్లుపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసింది. కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇస్తుంటే .. కేంద్రం మోటర్లకు మీటర్లు బిగిస్తానంటోదంటూ ప్రచారం చేసింది.
మరోవైపు వ్యవసాయ బిల్లుతో మార్కెట్ కమిటీలు రద్దై రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ప్రచారం హరీష్ రావు బలంగా చేసారు. ఇక ఉప ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే దుబ్బాకలో 9వేల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ సర్కార్. మరోవైపు కాళేశ్వరంతో దుబ్బాక ప్రజల కరువు నుండి పూర్తిగా విముక్తిని చేసిన ఘనత కేసీఆర్దే అంటూ మంత్రి ప్రచారం నిర్వహించారు. ఇక దుబ్బాక వైపు ముఖ్యనేతలు, మంత్రులెవరూ చూడనే లేదు.
అయితే హరీష్ రావ్ ఒక్కడే ఈ తంతును చక్కబెట్టారు. అయితే టీఆర్ఎస్ కు పెన్షనర్లు అండగా ఉంటారని.. రైతులు సైతం తమకు ఎల్లప్పుడు తోడుగా ఉంటారని భావిస్తున్నారు. వీరిద్దరు టీఆర్ఎస్కు ఓటేస్తే గెలుపు ఖాయం . అయితే వీరు ఎవరి వైపు ఓటేసారన్నది చూడాలి.
యువతే బీజేపీ బలం.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తన నమ్మకాన్నంతా యువతపైనే పెట్టుకుంది. యువత తమ వైపే ఉన్నారని నమ్ముకున్న బీజేపీ సోషల్ మీడియా వేదికగానే ఎక్కువ ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో ఏ చిన్న ఘటననైనా వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లగలిగింది. కేంద్ర ప్రభుత్వం నిదులు ఇవ్వక పోతే రాష్ట్రం నియోజక వర్గ అభివృద్దికి ఎక్కడ నుండి నిదులు ఇచ్చారో చెప్పాలంటూ బీజేపీ సూటిగా ప్రశ్నించింది.
ఇక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా- మాజీ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి మరణించిన నాటి నుండే ప్రచార పర్వానికి తెరలేపారు. ఇక బీజేపీ నేతలు సైతం ఆయనకు అండగా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల ప్రసంగాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ప్రచారం లో దూసుకు పోయారు.
పోటీలో ఉన్న ఏ అభ్యర్థి చేయనంతగా గ్రామాలను చుట్టి వచ్చారు రఘునందన్ రావ్. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అందరిలో ఒకరుగా ఉంటారని… తనను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులను తీసుకు రావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు తమ వంతూ అడ్డుకట్ట వేస్తానంటూ ప్రజల్లోకి వెళ్ళారు. అయితే టీఆర్ఎస్ లా కాకుండా ఈ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రస్థాయిలో నేతలంతా నియోజక వర్గంలో పర్యటించారు.
వీరికి తోడు నియోజక వర్గాల ఇన్చార్జ్ లు, జిల్లాల అధ్యక్షులు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను గడప గడపకు వివరించారు. దీంతో యువతతో పాటు వారు వారి కుటుంబ సభ్యులను కూడా బీజేపీకి ఓటు వేయిస్తే తమ పార్టీ గెలుపు పెద్ద కష్టమేమీ కాదన్న భావనలో ఉన్నారు బీజేపీ నేతలు. ఇక బీజేపీ పెన్షనర్లు సైతం తమకు మద్దతుగా నిలిచారని.. టీఆర్ఎస్ ప్రచారానికి వ్యతిరేకంగా రైతులు కూడా బీజేపీ వైపు మొగ్గుచూపారన్న ప్రచారం సాగుతోంది. వారు అనుకుంటున్నట్టుగా దీంతో మూడు వర్గాలు బీజేపీ వైపు ఉంటే మాత్రం ఆ పార్టీ ఇక తిరిగిచూడాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సైలెంట్ ఓట్లనే నమ్ముకున్న కాంగ్రెస్
దుబ్బాక ఉప ఎన్నికల్లో బలంగా కదన రంగంలోకి దిగి అంతే వేగంగా వెనక్కు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ఆ పార్టీ కొత్త ఇన్చార్జ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలను మండలాలకు గ్రామాలకు ఇన్చార్జ్ లు నియమించారు. దీంతో ఆ పార్టీ నేతలంతా ప్రచారంలో దిగిపోయారు. అయితే ఈ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేసిన పని చాలా తక్కువే అంటున్నారు.
దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ ల మధ్యే మాటల తూటాలు పేలడం, భౌతిక దాడులు చేసుకున్నారంటూ ప్రచారం వెరసి కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా పెద్దగా ప్రచారం జరగలేదు. అయితే అంతర్గతంగా తమ పని తాను చేసుకుంటూ పోయారు కాంగ్రెస్ పార్టీ వారు అన్న ప్రచారం సాగుతోంది. ఓ దశలో ఆ పార్టీ బరిలో ఉందా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తం చేసారు దుబ్బాక ప్రజలు.
అయితే ఎవరితో తమకు ప్రమేయం లేదని.. ప్రజలు టీఆర్ఎస్ తో పాటు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతతో తమను ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారు . ఆ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు కనీసం అభ్యర్థి కూడా లేక పోవడంతో తమ పార్టీ మాజీ నేత చెరకు శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుండి తెచ్చుకుని మరీ టికెట్ కేటాయించారు.అయితే ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాక పోగా అతను తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుతాడన్న ప్రచారం జోరుగా సాగింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినా ప్రజల నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదంటున్నారు నిపుణులు. గతంలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లైనా ఈ సారి వస్తాయా అన్నఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ తో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందన్న భావనలో ఉంది ఆ పార్టీ.