ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో మఠం ఖాళీ చేసి, భవనాన్ని టీటీడీకి అప్పగించాలని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న విశాఖ శ్రీశారదా పీఠం భవనం ముందు, వెనుక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా..అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్దీకరించింది. ఐతే ప్రజా సంఘాలు,హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళనలకు దిగాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
తర్వాత విశాఖ శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు..బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం తితిదేకు ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది.
దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో తిరుమలలో శారదాపీఠం నిర్మాణం జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ చెబుతోంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని గంలో ప్రకటించినా..భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. మరి ఈ నోటీసులపై శారదా పీఠం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భవనాన్ని కాళీ చేసి టీటీడీకి అప్పగిస్తారా.. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు విశాఖపట్నంలోనూ శారదా పీఠం భూ కబ్జాలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఈ పీఠానికి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో రూ.250 కోట్ల భూములను తక్కువ ధరకు అప్పగించారు. ఐతే కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. అయితే పెందుర్తి మండలం చినముషిడివాడలో ఉన్న శారదా పీఠాన్ని ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక సమర్పించారు..కొంతమేర ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. వాటిని ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. మొత్తం మీద అటు తిరుమల, ఇటు విశాఖపట్నంలో శారదా పీఠానికి సంబంధించిన భూములు, భవనం అంశం ఆసక్తికరంగా మారింది