మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ .. ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లోనూ, టీవీల్లోనూ, ఓటీటీలోనూ దుమ్మురేపేసిన ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో వైష్ణవ్ .. పలు భారీ సినిమాల ఆఫర్స్ అందుకుంటున్నాడు. అయితే ‘ఉప్పెన’ సినిమా ఇంకా విడుదలవకుండానే.. అతడి రెండో సినిమా మొదలైపోవడం.. టాకీ పార్ట్ కూడా పూర్తయిపోవడం కూడా జరిగిపోయాయి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కింది.
ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరెడ్డి ‘కొండపొలం’ నవలా సృష్టికర్త. ఒక అడవిని జీవనాధారంగా చేసుకొని ఆ చుట్టుపక్కల నివసించే గొర్రెల కాపరుల జీవిత గాథ ఈ నవల. హీరో వైష్ణవ్ తేజ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ గిరిజనులుగా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా థియేటర్స్ లో కన్నా ఓటీటీకే నప్పుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే దీనిని డిసెంబర్ లో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘కొండపొలం’ అనే టైటిలే యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట దర్శకుడు క్రిష్. త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు .. విడుదల తేదీ కూడా ప్రకటిస్తారట. యన్టీఆర్ సిరీస్ తో వరుస పరాజయాలు మూటగట్టుకొన్న క్రిష్.. కొండపొలం సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా హీరో వైష్ణవ్ కి, దర్శకుడు క్రిష్ కి ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.