విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఆవిష్కరణ కాబోతున్న నగరం. ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారం. ఇప్పటికే రాజధానికి సంబంధించిన సకలు పనులు పూర్తి చేసేస్తున్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కురసాల కన్నబాబు రెండు నెలల క్రితం వరకూ జిల్లాలో అన్నీ తానే అయి వ్యవహరించారు. అధికారులతో సమీక్షలు కాని, అభివృద్ధి పనులపై చర్యలు కాని, సమావేశాలు కాని మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగానే జరిగాయి. అయితే, ఇటీవల మారిన పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సాక్షాత్తూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే చెబుతున్నారు.
మొన్నటి వరకూ జిల్లాలో అన్నీ తానే అయి వ్యవహరించిన మంత్రి కురసాల కన్నబాబు ప్రస్తుతం మౌన మద్ర దాలుస్తున్నారని అంటున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం బుధవారం జిల్లాలో జరిగిన అభివృద్ధి సమీక్షా మండలి సమావేశమే అంటున్నారు. గతంలో జరిగిన అభివృద్ధి సమీక్షా సమావేశాలను మంత్రి కురసాల కన్నబాబే నిర్వహించే వారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు.
ఎంపీగారే అంతా…
ఆయన అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యుడు. ఆయనే విజయసాయి రెడ్డి. అయితే ఆయన స్ధానిక ఎంపీ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావుల కంటే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హవా ఎక్కువగా కొనసాగడం పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కొరవడడం లేదంటున్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబుతో పాటు స్ధానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు కూడా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చర్యలతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఇటీవల మంత్రి ముత్తంశెట్టి అయితే తన వద్దకు ఎవరూ రావద్దని, ఆయననే వెళ్లి కలవాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
బుధవారం నాటి సమీక్షా సమావేశంలో కూడా విజయసాయి రెడ్డే ప్రధాన పాత్ర పోషించడం అటు అధికారుల్లోను, ఇటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్లోనూ కలవరం తెప్పిస్తోంది. ‘విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు. ఆయన విశాఖపట్నం ఒక్కదానికే రాజ్యసభ సభ్యులు కాదు. మొత్తం రాష్ట్రానికంతటికీ. ఈ విషయం ఆయనకు తెలియడం లేదు. ఎప్పుడు చూసినా విశాఖపైనే దృష్టి పెడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు’ అని నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వైఖరిపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆగ్రహం పెరిగితే దాని ప్రభావం పార్టీపై ఉంటుందని వారంటున్నారు.