ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారం చేయక తప్పదు. ఇంటింటి ప్రచారమనేది పాత ముచ్చట. ఇప్పుడంతా టెక్నాలజీతోటే ప్రచారం సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తే ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు గానీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మాత్రం మంచి ఫలితాలను రాబడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ దేశ ప్రధానిగా కావడంలో ఈ సోషల్ మీడియా ప్రచారం ఏ రేంజ్లో పనిచేసిందో మనం చూశాం. దీనిని దృష్టిలో పెట్టుకున్న మిగతా రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక సోషల్ మీడియా టీంలను పెట్టుకున్న విషయం తెలిసిందే. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు సోషల్ మీడియా టీంలు లేని పార్టీ ఒక్కటీ కూడా లేదంటే నమ్మడం కష్టమే.
సోషల్ మీడియాలో ప్రచారంను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ పార్టీకి తెలిసినంతా మరి ఏ ఇతర పార్టీకీ తెలియదంటే అతిశయోక్తి కాదు! సోషల్ మీడియా వేదికగా ప్రచారంను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ పార్టీ దుబ్బాకలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రచార విషయంలో బీజేపీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఫేస్బుక్(ఎఫ్బీ)లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో పోలిస్తే ఇదీ చాలా ఎక్కువ. 3.14 లక్షల మంది ఆయనకు ఎఫ్బీలో ఫాలోవర్లుంటే.. 2.31 లక్షల మంది ఆయన పేజీని లైక్ చేశారు. దీంతో ఎఫ్బీలో పెట్టిన పోస్టులు జనంలోకి వెళ్లి ఆయన గెలుపుకు బాటలు వేశాయి.
ఆ విషయంలో టీఆర్ఎస్ ఫెయిల్..
ప్రత్యర్థుల ఆరోపణలను ఎదుర్కొనడంలో బీజేపీ వ్యూహాత్మకంగా దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తప్పులను, ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలను బీజేపీ శ్రేణులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత విద్యార్హత, మాటతీరు, ఆమె గెలుస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలను వ్యంగ్యంగా రూపొందించిన వీడియోలు, ప్రకటనలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే రఘునందన్రావు బంధువు ఇంట్లో దొరికిన డబ్బుల విషయంలో.. పోలీసులే ఆ డబ్బులు తెచ్చి పెట్టారనే అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ఓటర్లలోకి వేగంగా బీజేపీ శ్రేణులు తీసుకెళ్లారు. ఇలా జనం దృష్టిని ఆకర్షించారు. డబ్బుల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందనే చెప్పాలి.
అంతేకాకుండా పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారంటూ ఓ టీవీ ఛానల్లో వచ్చిన వీడియో బాగా వైరలైంది. అయితే కావాలనే బీజేపీ ఇలా తప్పుడు ప్రచారం చేసిందని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు వివరించే ప్రయత్నం చేసినా ఆ న్యూస్ ప్రజల్లోకి వేగంగా వెళ్లింది. దీంతో ఆ రెండు పార్టీలకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. అలాగే సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడిన ఒక వీడియో కూడా వైరల్ చేశారు. ఇది కూడా బీజేపీకి ప్లస్ అయి.. టీఆర్ఎస్కు మైనస్ అయ్యిందనే చెప్పాలి. ఇలా పలు అంశాలు, ప్రకటనలపై దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో వెలువడిన వీడియోలు వైరల్ అయి జనాల్లోకి వేగంగా వెళ్లి బీజేపీకి అదనపు బలాన్ని చేకూర్చి బీజేపీ గెలుపుకు దోహదం చేశాయి.