టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికలో బరిలో దిగేందుకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికతోపాటూ అస్త్ర శస్త్రాలనూ సిద్ధం చేసుకుంటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ మాత్రం రామలింగారెడ్డి కుంటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టాలని భావస్తోంది. అలాచేస్తే ప్రభుత్వంపై ఉండే అనుకూల ఓటుతో పాటు సానుభూతి ఓట్లు కూడా తమకే పడతాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అలాగే బిజెపి పార్టీ నుంచి రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆయన ప్రచారంలో మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందున్నాడు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో మొదట్లో విజయశాంతి పేరు ఖరారైందనే వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. కానీ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతగా సుముఖత చూపడంలేదని తెలిసింది. ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై పార్టీ పెద్దలు విజయశాంతి అభిప్రాయాన్ని అడిగినట్లు సమాచారం. అయితే ఈ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు ఇష్టంగా లేనని ఆమె వారితో తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2009-2014 మధ్య కాలంలో ఆమె మెదక్ ఎంపీగా పని చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తో విభేదించిన ఆమె 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మెదక్ ఎంపిగా ఉన్నప్పుడు జిల్లా ప్రజల అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో విజయశాంతిని ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటారు. దీనికితోడూ ప్రజాదారణ ఉన్న సినీ నటి కూడా కావడంతో విజయశాంతిని ఇక్కడి నుంచి పోటీ చేపిస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తోందని పార్టీ నాయకత్వం కూడా మొదట్లో భావించింది. కానీ ఇప్పుడు తాను పోటీ చేయనని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఇతర ఆశావహులకు మార్గం సుగమం అయనట్లైంది.
కాంగ్రెస్ లో పోటీ ఎక్కువే…
కాంగ్రెస్ పార్టీ నుంచి దుబ్బాక టికెట్ ఆశిస్తున్న వారిలో అరడజన్ మంది వరకు పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా కోమటి రెడ్డి నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక ఉప ఎన్నిల టికెట్ ఆశిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని బరిలోకి దింపుతుందని వీరు భావించారు. ఇప్పుడు విజయశాంతి పోటీలో లేదని తేలడంతో టికెట్ ను దక్కించుకోవడంలో ఎవరికి వారు తమ స్టైల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి మాత్రం ప్రచారాన్ని మొదటి నుంచే చేసుకుంటూ పోతున్నారు. స్థానిక నేతలను కలుపుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ, రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. కర్ణం శ్రీనివాస్ తో పాటు మరి కొంత మంది ఆశావాహులు తమ తమ స్థాయిలో టికెట్ల కోసం ఫైరవీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అధిష్టానం మాత్రం కోమటిరెడ్డి నరసింహారెడ్డికి టికెట్ ఇస్తే దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిగతా నాయకులు ఇతర పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముందుకు ఆశావహులతో మాట్లాడి వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇదే అంశంపై ఈ రోజు పార్టీ ముఖ్య నేతలందరూ సమావేశం ఏర్పాటు చేశారు.
2018లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి సోలీపేట రామలింగారెడ్డి పోటీచేస్తే, కాంగ్రెస్ నుంచి నాగేశ్వరరెడ్డి బరిలో నిలిచారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. సోలిపేట రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వస్తే… నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు మాత్రమే వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం ఆ ఎన్నికల్లో సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారపార్టీ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో 50 వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీని సాధిస్థామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుంటే…మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనీ, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అంశం తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది.
బరిలో బిగ్ బాస్ ఫేమ్ కార్తీక…
అయితే ఈ ఉప ఎన్నిక బరిలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక రెడీ అయ్యింది. ఇప్పటికే ఈమె దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే సిద్దిపేట జిల్లా బీసీ (గౌడ) సామాజికవర్గానికి చెందినది. దుబ్బాక నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గానికి ప్రభుత్వం పెద్దగా చేసిందేమీలేదని అంటున్నారు. గత ప్రభుత్వాలు దుబ్బాక నియోజకవర్గంలో తమ సామాజికవర్గానికి ఎలాంటి న్యాయం చేయలేదని ప్రజలకు చెబుతున్నారు. అంతేకాదు పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందాయని మరి దుబ్బాక నియోజకవర్గంను ఎందుకు అంతలా అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తన సామాజికవర్గానికే కాదు, ఏ ఒక్కరికి సమస్య ఉన్నా తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆమె ప్రచారం చేసుకుంటున్నారు.











