పన్ను ఎగవేత ఆరోపణలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఇటీవలే లండన్ కు చెందిన సంస్థ నుంచి రెహమాన్ వేతనంగా 3.47 కోట్లు తీసుకున్నారు. కానీ దానికి టాక్స్ చెల్లించకుండా ఆదాయపు పన్నును ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. తన పేరిట ఉన్న ఛారిటబుల్ ట్రస్ట్ ఖాతాలోకి నేరుగా వేతనాన్ని బదిలీ చేయమని బ్రిటిష్ కంపెనీని కోరడం ద్వారా దానిపై పన్ను చెల్లించకుండా రెహమాన్ తప్పించుకున్నారని ఐ-టి విభాగం ఆరోపించింది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఛారిటబుల్ ట్రస్ట్ కు వచ్చే నిధులకు ఎటువంటి టాక్స్ మన దేశంలో లేదని అందుకే ఏఆర్ రెహమాన్ ట్రస్ట్ ఖాతాలోకి వేతనాన్ని బదిలీ చేయించారని కోర్టుకు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ఇప్పటికే పలుమార్లు రెహమాన్ కు నోటీసులు పంపామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు. విదేశీ కంపెనీలకు రెహమాన్ చాలా సంవత్సరాలుగా జింగిల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలకు ఆయన పని చేస్తున్నారు. ఆయా కంపెనీల నుంచి భారీగా రెహమాన్ కు ముట్టుతోందని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఇదే సమయంలో తమిళ, హిందీ సినిమాలకు కూడా ఆయన హ్యూజ్ రెమ్యూనిరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మ్యూజిక్ కాన్సర్ట్ ద్వారా రెహమాన్ కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన డబ్బును ట్రస్ట్ ద్వారా రెహమాన్ తీసుకోవడంతో అధికారులు దీనిపై ద్రుష్టి సారించారు. రెహమాన్ కు నోటీసులు రావడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ఈ నోటీసులకు రెహమాన్ ఎలా స్పందించనున్నారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.