ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వింత చోటు చేసుకుంటుంది. పేరుకు జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన ముఖ్య సలహాదారు విజయసాయిరెడ్డిదే పెత్తనమంతా. గురువింద గింజ తన నలుపును ఎరుగదు అన్నట్లు తన సొంత పార్టీలో ఉన్న లుకలుకలు గురించి ఒక్కనాడైన ప్రస్తావించని సాయి రెడ్డి తమ అధినేతను మాత్రం నిత్యం ఆకాశానికి ఎత్తేస్తుంటారు. తాజాగా అలాంటి విషయం ఒకటి సాయి రెడ్డి నోట వెంట రావడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
అసలు విషయం ఏంటంటే…
తాజాగా ఏపీ ప్రభుత్వం పాఠశాల హాజరు రికార్డుల్లో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి విజయ సాయి రెడ్డి ప్రస్తావిస్తూ తన ట్విటర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘భారతదేశంలో కుల, మత భేదాలు లేని తొలి రాష్ర్టంగా ఏపీ అవతరించిందని, ఇందుకు జగన్ కు సలాం చెబుతున్నానని’ మన ఎంపీ గారు రాసేశారు. అంతేకాకుండా ‘కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం. ఎందరో మహాత్ములు కలలు కన్న కుల మత రహిత సమాజానికి ఇది నాంది’ అంటూ ప్రస్తావించేశారు.
మరి వీటికి సమాధానం ఏంటండి రెడ్డి గారు..?
కుల మత భేదాలు లేని రాష్ర్టంగా ఏపీ అవతరించిందంటూ రెడ్డి గారు వ్యాఖ్యనించేశారు బాగానే ఉంది. కానీ.. అసలు చిక్కు అక్కడే వచ్చి పడింది. అదేంటంటే… ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో మొదలు పెట్టిన కొన్ని కార్యక్రమాలకు కులం పేరే ముందు ఉన్నట్లు తెలుస్తుంది. కుల మత రహిత సమాజం అన్న వ్యక్తి.. కులాన్నే ముఖ్యంగా చూపుతూ ఎందుకు పనులు చేపడుతున్నట్లు కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కుల ప్రస్తావన లేని సమాజాన్ని ముందుకు నడిపించాలన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి అయితే కులాలను అడ్డుపెట్టుుకుని సానుభూతి కోసం ప్రయత్నించకూడదంటూ చురకలు అంటిస్తున్నారు.
కేవలం అటెండెన్స్ రిజిస్టర్లో తీస్తే సరిపోతుందా..?
ప్రభుత్వం కేవలం అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రమే కుల, మత ప్రస్తావన తీసుకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ, పాఠశాలలో చేరే ముందు నింపే పత్రంలో కులం ప్రస్తావన యథాతథంగా ఉంటుంది. ఇలాంటి ఏర్పాటు కుల రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడానికి ఎలా దారితీస్తుంది? మరి విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్లేప్పుడు తీసుకునే టీసీలో కులం అని, ఉపకులం అని ఖచ్చితంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. కేవలం అటెండెన్స్ రిజిస్టరులో మాత్రం.. ఒక చిన్న ఏర్పాటును మార్చగానే.. అక్కడికేదో కుల రహిత సమాజాన్ని ఆవిష్కరించుకున్నట్లుగా గొప్పలు కొట్టుకోవడం అనేది విజయసాయిరెడ్డికే చెల్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీనిపై వివరణ ఏంటండి..?
నిన్న కాక మొన్న కూడా మీరు బీసీలను 56 బీసీ కార్పొరేషన్ల జాబితా అంటూ ఒక పెద్ద జాబితాను విడుదల చేసేశారు. మరి ఇప్పుడు ఏమో కులమత రహిత సమాజం అంటూ ప్రకటనలు చేసేస్తున్నారు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారండి రెడ్డి గారు. మీరు ప్రస్తావించిన జాబితాలో ఇప్పటి వరకు ప్రజలు విని ఎరగని కులాలు కూడా ఎన్నో ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నికులాల సమాభివృద్ధి అనేది అవసరమే.. కానీ, అందుకు … కులాలన్నిటినీ గీతలు గీసి విడగొట్టడం అనేది.. విభజించి పాలించడమనే బ్రిటిషు పాలనను గుర్తుకుతెస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం….
పాఠశాల హాజరు రికార్డుల్లో విద్యార్థులు కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందరో మహాత్ములు కలలు కన్న కులమత రహిత సమాజానికి ఇది నాంది.— Vijayasai Reddy V (@VSReddy_MP) October 16, 2020











