ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతాదళాలకు ‘వర్చువల్’ సిమ్ కార్డులు చుక్కలు చూపిస్తున్నాయి. టెక్నాలజీ వాడుతూ మన సైన్యం రహస్య సమాచారాన్ని డీకోడ్ చేస్తోంది. ఉగ్రవాదులు మరింత అప్ గ్రేడ్ అవుతూ అధునాతన విధానాలను వాడుతున్నారు. ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లో పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. ఈ దాడిలో 40 మందికి పైగా మన దేశ సైనికులు మరణించారు. ఈ విషాద ఘటనపై విచారణ జరుపుతున్న సంస్థ ఓ కీలక విషయాన్ని బయట పెట్టింది. తమకు చెందిన సమాచారాన్ని తెలుసుకోకుండా ఉగ్రవాదులు ‘వర్చువల్’ సిమ్ కార్డులు వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సిమ్ కార్డుల వాడకం ద్వారా ఉగ్రవాదులు నిఘా వర్గాల నుంచి తప్పించుకుంటున్నారు.
‘ఈనాడు’ టెక్నాలజీ..
కమల్ హాసన్ నటించిన ‘ఈనాడు’ సినిమా చూశారా? ఈ సినిమాలో కమల్ పోలీసులకు బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి సమాచారాన్ని అందిస్తారు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ఫోన్ ఇతర దేశాల నుంచి రావడంతో అధికారుల దర్యాప్తు ముందుకు సాగదు. అలాంటి టెక్నాలజీని ఇప్పుడు ఉగ్రవాదులు వాడుతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. 2008, ముంబై ఎటాక్ లోనే ఉగ్రవాదులు ఈ టెక్నాలజీని వాడినట్లు గుర్తించారు. కానీ ఆ విషయాన్ని మన అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2019, పుల్వామా ఉగ్రదాడిలో కూడా ఉగ్రవాదులు ఈ సిమ్ కార్డులు వాడారని తేలడంతో అధికారులు దీనిపై ద్రుష్టి సారించారు.
ఎలా బయటికొచ్చిందంటే..
పుల్వామా ఉగ్రదాడికి పాల్పడ్డ ఆదిల్ దార్. ఆ దాడి సూత్రధారి మదస్సిర్ ఖాన్తో టచ్లో ఉన్నాడు. వర్చువల్ సిమ్ ద్వారా వీరు మాట్లాడుకోవడంతో నిఘా వర్గాలు పట్టుకోలేకపోయాయి. దీంతో మన భద్రతాదళాలు అమెరికాకు చెందిన ది మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్ డైరెక్టరీని సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఎలా పనిచేస్తుందంటే..
కంప్యూటర్ సైన్స్ లో క్యాచి మెమరీ, వర్చువల్ మెమరీ ఉండే సంగతి తెలిసిందే. అలాగే సిమ్ కార్డులు, వర్చువల్ సిమ్ కార్డులు ఉంటాయి. సర్వీస్ ప్రొవైడర్ మనకు ఓ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ను మనం వాడుకోవాలంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ యాప్ ను మన మొబైల్ లో ఇంస్టాల్ చేసుకోవాలి. ఆ నెంబర్ ను మన సోషల్ మీడియా అకౌంట్స్ కు లింక్ చేయాలి. దీంతో మనకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.
ఆ కోడ్ ను యాప్ లో ఎంటర్ చేస్తే సిమ్ లేకుండా ఆన్లైన్లో వర్చువల్ సిమ్ పనిచెయ్యడం మొదలుపెడుతుంది. ఉగ్రవాదులు ఈ సిమ్ లు వాడటం ద్వారా నిఘా వర్గాలను తప్పుదోవ పట్టించారు. దీంతో వేరేవారి పేరు మీద డాక్యుమెంట్స్ ఇచ్చి వీరు వర్చువల్ సిమ్ లను వాడారని నిర్దారించుకున్న అధికారులు మరింత సమాచారం కోసం అమెరికా సహయాన్ని కోరారు. వర్చువల్ సిమ్ డేటాను అమెరికా ఇస్తే ఉగ్రవాదుల కదలికలు, వారి ప్రణాళికలు మనకు తెలిసే అవకాశం ఉంది.