విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు వైఎస్ఆర్సిపి మరో నాటకీయ పరిణామానికి తెరలేపింది. అందులో భాగంగా 48 గంటలపాటు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవరం ప్రారంభించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఆ కుటిల యత్నాలు అడ్డుకోవాలనే లక్ష్యంతో నిరాహార దీక్షకు దిగింది .
వివాదం కోర్టు పరిధిలో ఉండగా..
ప్రస్తుతం మూడు రాజధానులు అంశం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని తరలింపు పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీం కోర్టు గడప తొక్కి స్టే ఎత్తివేయాలని కోరినప్పటికీ, అందుకు సుప్రీం కోర్టు నో చెప్పింది. సెప్టెంబర్ 17 నుంచి హై కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి త్వరగా తేల్చాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఆందోళన వల్ల అధికార పార్టీ ఏం సాధించాలని కోరుకుంటుందో అంతుచిక్కడం లేదు.
ఈ ఆందోళన వల్ల ప్రత్యేకంగా ఒరిగే లాభం లేదు. గతంలోనూ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల వారీగా మూడు రాజధానుల కు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. విశాఖ వాసుల స్వభావం ప్రకారం… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యతిరేకించడం గానీ, స్వాగతించడం గానీ చేయడం లేదు. వివాదం అంతా అధికార పక్షం, విపక్షాల మధ్య నడుస్తోంది.
విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం వెనక భూ లావాదేవీలు ఉన్నాయని ఆరోపణ చేస్తున్న తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎక్కువ భూ కుంభకోణాలు జరగడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాలతో విచారణ చేపట్టాల్సి వచ్చింది. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహంలో భాగంగానే అధికార పార్టీ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా అదే నిజం అన్న భావన ప్రజల్లో కల్పించే దిశగా కార్యాచరణ రచించింది. అందులో భాగమే చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని… విశాఖ వాసులంతా పరిపాలన రాజధాని కోరుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తోంది.