మాటల్ని సూదులుగా చేసి మాట్లాడేవారు కొందరు ఉంటారు. చేయి ఎత్తరు కానీ.. ఎదుటోడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా చేసే టాలెంట్ కొంతమందికి ఉంటుంది. ఆట ఏదైనాసరే.. గిల్లటాలు.. గిచ్చటాలు లాంటివి ఉండవు. కానీ.. ఏపీ రాజ్యసభ సభ్యులు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ట్వీట్లు చూస్తే.. ఆయన ఆలోచనలు.. ఆయన తీరు ఎలా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. తనకు తానుగా ట్వీట్లు పోస్టు చేసేంత తీరిక.. ఓపికా ఉండదన్నది తెలిసిందే. కాకుంటే.. ఆయన పేరుతో పోస్టు అయ్యే పోస్టులు అన్ని ఆయన టీం చూసుకుంటూ ఉంటుంది. ప్రతి పోస్టును పెట్టే ముందు ఆయన అనుమతి తప్పనిసరి అని చెబుతారు.
రాజకీయ సంబంధిత పోస్టుల్ని ఎంత పనిలో ఉన్నా సరే.. చదివి ఓకే చెప్పిన తర్వాతే పోస్టు చేస్తారని చెబుతారు. అంటే.. విజయసాయి పేరుతో పోస్టు అయ్యేప్రతిది ఆయన కనుసన్నల్లోనే ఉంటుందని చెప్పక తప్పదు. మరి.. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన కంప్లైంట్ మీద ఎందుకని ట్వీట్ చేయలేదు. తమ మీడియా సంస్థల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గంగూలీ ఇంటర్వ్యూ అచ్చేసి.. ఆయన నోట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విచారణకు ఆదేశించాలన్న విషయాన్ని చెప్పించే ప్రయత్నం చేసినప్పుడు.. విజయసాయి ట్వీట్ పిట్ట తన అభిప్రాయాన్ని ఎందుకు చెప్పలేదు? అన్నది ప్రశ్నగా మారింది.
ప్రతి విషయంలోనూ చెలరేగిపోయినట్లుగా పోస్టు పెట్టటమే కాదు.. వ్యంగ్యం.. ఎటకారం లాంటి వాటిని అస్సలు మిస్ కాని విజయసాయి.. రోటీన్ కు భిన్నం అన్నట్లుగా సుప్రీం ఎపిసోడ్ లో సైలెంట్ గా ఉండటం అంటేనే.. ఏదో తేడా కొట్టినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా వ్యవహరించి.. ఆ పై ప్రభుత్వ సలహాదారుగా మారిన పెద్ద మనిషి చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారెవరు మాట్లాడకపోవటం గమనార్హం. అన్నింటికి మించి విజయసాయి ట్వీట్లులో ఎక్కడా ప్రస్తావనకు రాని సుప్రీం అంశం కొత్త చర్చకు తావిస్తోందన్న మాట వినిపిస్తోంది.