సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలు అనేక వికృత చర్యలకు దారి తీస్తున్నాయని తెలిసినప్పటికీ అనేక మంది మోసపోతునే ఉన్నారు. అయినప్పటికీ కొందరు ఇంకా అవగాహన పొందలేకపోతున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వ్యక్తి చేతిలో మోసపోయి ఇప్పుడు నాకు న్యాయం చేయాలంటుంది ఓ యువతి..
వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి కాకినాడ నగరంలోని జగన్నాయక్ పూర్ పెట్రోలు బంకు వద్ద ఓ యువతి తన బిడ్డతో కలిసి నిరసనకు దిగింది. ప్రేమ పేరుతో తల్లిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడంటూ పెట్రోల్ బంకు యజమాని కర్రి కిరణ్ పాల్ మీద ఆరోపణలు చేసింది.
అసలేం జరిగింది..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన బలే శ్రీదేవి అనే యువతికి 2018లో కాకినాడకు చెందిన కిరణ్ పాల్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. తరువాత వీరివురు ప్రేమ పేరుతో కలుస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే శ్రీదేవిని శారీరకంగా దగ్గర చేసుకున్న కిరణ్ పాల్ రెడ్డి తరువాత కొద్ది రోజులకు ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయ్యింది. యువతి తనను పెళ్లి చేసుకోమంటే కిరణ్ పాల్ రెడ్డి ముఖం చాటేయ్యడంతో పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ కిరణ్ పాల్ రెడ్డి నిత్యం యువతిని బెదిరిస్తూండటంతో యువతి బిడ్డతో కలిసి పెట్రోల్ బంక్ ముందు నిరసనకు దిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











