ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి… మహిళా లోకంపై జరిగే అకృత్యాలపై ఉక్కుపాదం మోపుతామని ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరహా ప్రకటనలు జగన్ బ్యాచ్ నుంచి దండిగానే వచ్చినా.. ఆచరణలో మాత్రం గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించని ఉదాశీనంగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసు వ్యవహారం నిలుస్తోందని చెప్పక తప్పదు. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నామని స్వయంగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన వచ్చిన నెలల తర్వాత కూడా ఈ కేసును సీబీఐ టేకప్ చేయని విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అసలు ఈ కేసును టేకప్ చేయాలంటూ తమకు ఇప్పటిదాకా ఆదేశాలే రాలేదని స్వయంగా సీబీఐ తేల్చి చెప్పడం సంచలనంగా మారింది.
న్యాయం చేయాలంటూ ప్రీతి తల్లిదండ్రుల పోరాటం
ఈ కేసు వివరాల్లోకి వెళితే… కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక సుగాలి ప్రీతి… 2017లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. తొలుత ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగినా… ఆ తర్వాత అది ఆత్మహత్య కాదని, సదరు పాఠశాల కరస్పాండెంట్ కొడుకులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తేలింది. దీంతో హత్యాచారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితులు బెయిల్పై విడుతలయ్యారు. ఈ క్రమంలో తన కూతురుకు న్యాయం చేయాలంటూ ప్రీతి తల్లిదండ్రులు పోరాటం మొదలెట్టారు. ఈ పోరాటం జరుగుతుండగానే… జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక నిందితులు జగన్ సామాజిక వర్గానికి చెందినవారేనని, జగన్ సీఎం అయ్యాక తమకు న్యాయమెలా జరుగుతుందని ప్రీతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వీరి బాధను తెలుసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా కర్నూలు వచ్చి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచేందుకు సిద్ధపడ్డారు.
Must Read ;- జగన్ నియోజకవర్గంలో దళిత మహిళపై దారుణం

సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా జగన్ ప్రకటన
అప్పటికే రాష్ట్రంలో మహిళలకు అండగా నిలుస్తున్నామని, ఆ క్రమంలోనే కఠిన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని ప్రకటించిన జగన్… తన కర్నూలు పర్యటనలో ప్రీతి తల్లిదండ్రులను కలిసి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. తక్షణమే కేసు ఫైల్ ను సీబీఐకి అందజేయాలని కూడా కర్నూలు జిల్లా ఎస్పీకి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జగన్ నుంచి ఈ తరహా ప్రకటన రావడంతో ప్రీతి తల్లిదండ్రులు నిజంగానే సంతోషపడ్డారు. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా జగన్ ప్రకటించి నెలలు గడుస్తున్నా… కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రీతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు వారు నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.అక్కడ సీబీఐ అధికారులను కలిసి ఆరా తీశారు.
ఎలాంటి ప్రతిపాదన రాలేదన్న సీబీఐ
ఈ సందర్భంగా ప్రీతి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే… ప్రీతి హత్యాచారం కేసును దర్యాప్తు చేయాలంటూ తమకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిపాదన రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాకుండా ఈ కేసు దర్యాప్తును తామెలా చేపడతామని సీబీఐ అధికారులు చెప్పారట. దీంతో షాక్ తిన్న ప్రీతి తల్లిదండ్రులు… ఈ కేసుకు సంబంధించి జగన్ చేసిన ప్రకటనలు, తమకు ఇచ్చిన హామీలను సీబీఐ అధికారుల ముందు ప్రస్తావించారట. సీఎం నుంచి ప్రకటనలు వచ్చినా.. తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ కేసు టేకప్ చేసేందుకు వీలు లేదని, అసలు ఈ కేసును తాము చేపట్టాలంటూ తమకు కనీసం మౌఖిక ఆదేశాలు కూడా జారీ కాలేదని సీబీఐ అధికారులు చెప్పారట. దీంతో తమ కూతురుకు జరిగిన అన్యాయంపై జగన్ చేసిన ప్రకటనలు, తమకు ఇచ్చిన హామీలన్ని ఒట్టి బూటకమేనని ప్రీతి తల్లిదండ్రులు ఆయన చేసిన ప్రకటనలు, ఉత్తుత్తిగా జారీ చేసిన జీవో కాపీలను మీడియా ముందే చించిపడేశారట. మొత్తంగా..జగన్ మార్కు న్యాయం ఏ పాటిదో తేలిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు











