గత ఐదేళ్లల్లో వైసీపీ చేసిన అడ్డగోలు వ్యవహారాల లెక్క తేల్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్దమయ్యారు. అయితే ఈ లెక్క తేల్చడంలో కక్ష తీర్చుకుంటున్నారనే పద్దతిలో కాకుండా చట్టబద్ధంగా వారు వ్యవహారించిన అక్రమాలను, చట్ట ఉల్లంఘనలను బహిర్గతం చేస్తూ.. అలా వ్యవహారిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయో అటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో వైసీపీ చేసిన అవినీతి వ్యవహారాలు, చట్ట ఉల్లంఘనల మొత్తాన్ని లెక్క తేల్చేందుకే చంద్రబాబు రెడీ అయ్యారు. టీడీపీతోపాటు మరికొంతమంది సామాజిక కార్యకర్తల నుంచి .. వైసీపీలోని అక్రమార్కులను, వేధించిన వారిని క్షమించేస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో.. రెండురోజుల కిందట చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా ఎలా వ్యవహారించాలో పరిశీలించి.. అందుకు సంబంధించిన కేసులపై సమీక్ష చేశారు. తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని చంద్రబాబు స్ఫష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ హయాంలో అక్రమార్కులుగా ఉన్నవారు.. చట్టవ్యతిరేకంగా వ్యవహారించిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
అయితే వైసీపీలో ఇష్టానుసారంగా వ్యవహారించిన వారిపై తీసుకునే చర్యలు కక్ష సాధింపులు అన్న భావన రాకుండా …. తప్పు చేశారు కాబట్టి శిక్ష అన్న భావన రావాలని.. ప్రజల్లోకి ఇదే సందేశం స్పష్టంగా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కీలక అరెస్టులు చేసే ముందు వారు ఎలాంటి తప్పులు చేశారో స్పష్టంగా ప్రజలకు తెలిసేలా చూస్తున్నారు. బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ విషయంలోనూ అదే చేస్తున్నారు. నటి విషయంలో పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుకొచ్చేలా చేశారు. బాధితులతోపాటు నిందితులుగా ఉన్న వారికి న్యాయపరమైన అవకాశాలను కూడా ఇస్తున్నారు. అయితే నిందితులు చేసిన తప్పులకు కోర్టుల్లోనూ రిలీఫ్ రావడం కష్టం కాబట్టి … ఇవాళ కాకపోతే రేపైనా అరెస్టులు ఉంటాయని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
నటి కాదంబరి జెత్వానీ కేసులోనే కాకుండా.. లిక్కర్ మాఫియా.. ఇసుక రీచ్ల్లోనూ జరిగిన అక్రమాలు, సాక్ష్యాలు బయటకే కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ సాక్ష్యాలున్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోలేదు. అయితే సీఐడీ రంగంలోకి దిగి కేసును త్వరగా విచారణ పూర్తి చేయించేలా చూసి.. అరెస్టులు ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ డిసైడయింది. ఇక ఇప్పటికే గనుల శాఖలో అక్రమాలకు పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. లిక్కర్ స్కాంలో అసలు కింగ్ పిన్గా వ్యవహారించిన వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. ఇప్పటికే వివరాలన్నీ సేకరించినందున త్వరలోనే వాసుదేవరెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారితోపాటు మరికొన్ని కేసుల్లోనూ వైసీపీకి అనుకూలంగా వ్యవహారించిన అధికారులను కూడా శ్రీకృష్ణజన్మ స్థానానికి పంపించే ప్రయత్నంలో టీడీపీ కూటమి సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల సేకరణలో సర్కార్ తలమునకలైంది. ఆధారాలు లభిస్తే.. వెంటనే వారికి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.