ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య విభేదాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని అగ్ర నాయకులకు ఇరువర్గాల నాయకులు పలుమార్లు ఫిర్యాదులు చేసుకున్నారు. అంతటితో ఆగక రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని విజయవాడలో శుక్రవారం ఇరువర్గాల నాయకులు కలిశారు.
తొలుత ఒక వర్గం నాయకులు బాలినేనిని కలవటానికి బయలుదేరారనే విషయం తెలియగానే, రెండో వర్గం నాయకులు హుటాహుటిన బయలదేరి వెళ్లారు. ఇరు వర్గాల నాయకులతో మాట్లాడిన మంత్రి త్వరలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తానని తెలిపినట్లు సమాచారం.
వైఎస్ వర్ధంతి రోజూ వర్గపోరు…!
సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజూ కూడా తాళ్లూరు మండలంలో మద్దిశెట్టి, బూచేపల్లి వర్గాలు.., రెండుగా చీలిపోయి ఎవరికి వారే వేడుకలు నిర్వహించారు. ఇంతటితో ఆగక.. పోటా పోటీగా ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
వివాదానికి కారణాలు ఏమిటి..?
జగన్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి దర్శిలో బూచేపల్లి కుటుంబానిదే ఆధిపత్యం. వై.ఎస్ కుటుంబానికి సన్నిహితులు, రెడ్డి సామాజిక వర్గం కావడంతో నియోజకవర్గంలోనూ, పార్టీలోనూ వారికి ఎదురే లేకుండా పోయింది. కానీ, ఓడలు బండ్లు.., బండ్లు ఓడలైనట్లు.., 2014 ఎన్నికలో టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు చేతిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓటమి పాలైనారు.
ఆ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టడం, టీడీపీ ప్రభుత్వంలో బూచేపల్లికి చెందిన గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో 2019లో తాను బరిలో నిలవలేనని జగన్ కి చెప్పిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.., వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ కి మద్దతుగా పనిచేసి.., వైసీపీ గెలుపునకు కృషిచేశారు.
కానీ, ఎన్నికల సమయంలో పాలు- నీళ్లలా కలిసి పనిచేసిన మద్దిశెట్టి, బూచేపల్లి.., ఏడాది గడవక ముందే ఉప్పూ-నిప్పులా తయారయ్యారు. కాంట్రాక్టులు, గ్రామ వాలంటీర్ నియామకాలు, అభివృద్ధి పనులు అన్నింటిలో తన మాటే నెగ్గాలని ఎమ్మెల్యే…, మేము లేకపోతే ఎమ్మెల్యే ఎలా గెలిచేవాడు, అన్నీ తమ కనుసన్నల్లోనే జరగాలని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి పట్టుబడుతుండటంతో పార్టీ రెండుగా చీలిపోయింది.
ఇప్పటికే శిలాఫలకాల్లో తమ పేర్లు లేవని, తమను పిలవకుండా ప్రారంభోత్సవాలు ఏమటని.., రెండు వర్గాలు నిరసనలకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే మద్దిశెట్టి., బూచేపల్లి నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నాడని.., సీఎం జగన్ కి ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై జగన్ సూచనతో మంత్రి బాలినేని ఇద్దరికీ గట్టి వార్నింగ్ నే ఇచ్చారు. కానీ, వారి తీరు మారలేదు. ఇప్పుడు మళ్లీ పంచాయతీ అమరావతికి చేరింది.
చూడాలి…, ఈ సారి అన్నా వైసీపీ అధిష్టానం మద్దిశెట్టి, బూచేపల్లి మధ్య సయోధ్య కుదుర్చుతారో.., లేక పార్టీ లైన్ దాటితే కఠినంగా చర్యలు తీసుకుంటారో చూడాలి…!