సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎప్పుడో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి చాలా సంవత్సరాల తరవాత సత్తెనపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సత్తెనపల్లిలో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న అంబటి రాంబాబు ఎట్టకేలకు 2019లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రరావుపై విజయం సాధించారు. కాపు సామాజికవర్గంలో వైసీపీలో సీనియర్ నేత కావడంతో అంబటికి మంత్రి పదవి దక్కుతుందని చాలా మంది అంచనా వేశారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేరుగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కాపు నేతలకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన సీఎంకు లేదని తెలుస్తోంది.
అంబటికి మంత్రి పదవి కలేనా..
తన రాజకీయ జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి వెలగబెట్టాలని అంబటి రాంబాబు చాలా ప్రయత్నాలే చేశారు. వైసీపీలో గట్టి వాయిస్ వినిపించే వారిలో అంబటి ఒకరు కావడం, చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడంలో రాంబాబుకు ఎవరూ సాటిరారు. మరి ఇంత కష్టపడ్డా అంబటికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన వాయిస్ బాగా తగ్గించారు. అతిగా మాట్లాడటం వల్లే అంబటికి మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం సాగుతోంది. అందుకే అంబటిని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని తెలుస్తోంది.
మంత్రి వర్గాన్ని విస్తరించినా అంబటికి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మరి మడమ తిప్పరు కనుక విస్తరణలో రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన హోం మినిష్టర్ సుచరితను మార్చే అవకాశం కూడా కనిపించడం లేదు. పేరుకే ఆమె మినిష్టర్ అయినా అంతా షాడోలే చక్కబెడుతున్నారు. అందుకే అంబటి ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. చంద్రబాబుపై రంకెలు వేసినా ప్రయోజనం లేదని గ్రహించిన అంబటి రాంబాబు సత్తెనపల్లి రావడం తగ్గించేశారట. ఎప్పుడో చుట్టపు చూపుగా పక్షం రోజులకు ఒకసారి కనిపించి, ఏదైనా ఉంటే తమ్ముడు మురళీకి చెప్పుకోవాలని కార్యకర్తలకు బహిరంగంగానే చెప్పేశారు. అంటే ఆయనకు కూడా అర్థమైంది అటు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు సత్తెనపల్లిలో రెడ్డి సామాజికవర్గమే తనపై మైనింగ్ కేసులు పెట్టి వేధిస్తోంది. విషయం బోధపడటంతో అంబటి వచ్చే ఎన్నికల నాటికి మరో నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారట.
వారి అండ లేకుండా గెలవలేరు
సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసేవారు రెడ్డి సామాజికవర్గం అండలేకుండా గెలవడం సాధ్యం కాదు. ఆ సామాజికవర్గానికి చెందిన 43,000 ఓట్లు వైసీపీకి చాలా కీలకం. అందుకే అటు రెడ్డి సామాజికవర్గ అండతో, కాపుల ఓట్లతో గెలిచిన అంబటి రాంబాబుకు ప్రస్తుతం కొందరు రెడ్డి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. మరలా గెలిపిస్తే అంబటి పాతుకుపోతాడని, ఇక తాము జీవితంలో ఎమ్మెల్యే కాలేమని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గత ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి వైసీపీ నుంచి ముగ్గురు రెడ్లు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ఒక్కసారి అంబటిని గెలిపించాలని జగన్ కోరడంతో వారు కాదనలేకపోయారు. ఇక సత్తెనపల్లిలో అంబటికి ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే విషయం అంబటికి కూడా అర్ధమై అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. తనదాకా వస్తేగాని తత్వం బోధపడదంటే ఇదేనేమో.











