వైఎస్ఆర్ సీపీ ప్రక్షాళనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఈసారి టికెట్లు ఇవ్వలేమని, స్థాన చలనం తప్పదని వారికి ముఖం మీదే చెప్పేస్తున్నారు. తన మార్పులతో వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా వారిని పట్టించుకుంటామని సీఎం హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. మొన్న 11 చోట్ల కొత్త ఇన్ఛార్జులను నియమించగా, అందులో ముగ్గురు మంత్రుల సీట్లు మార్చారు. తాజాగా ఇంకో మంత్రిని కూడా తప్పిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీకి మరో చోట నుంచి పోటీ ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంను కలుస్తుండగా.. వారిలో ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, చింతలపూడి నుంచి ఎలీజా, పి.గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జగన్ ను కలిశారు.
గత ఎన్నికల్లో 2019లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత వైఎస్ఆర్ సీపీలో చేరిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఇప్పటికే టికెట్ నిరాకరించారు. ఆయన తనకు జగన్ అన్యాయం చేశారని వాపోయారు. నిన్న ఆయన కూడా సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిసింది. పది రోజుల క్రితం మార్చిన 11 మంది ఇన్ ఛార్జిల్లో ఐదు మంది దళితులు, ముగ్గురు బీసీలకు స్థాన చలనం కల్పించారు. తాజాగా కలిసిన ఎమ్మెల్యేల్లో కూడా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని తేల్చిచెప్పేసినట్లు తెలిసింది.
రామచంద్రపురం ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి లేదా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. రామచంద్రపురం స్థానం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ భరత్ ను అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఒక ఎస్సీ ఎమ్మెల్యేను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని, ఎస్టీ ఎమ్మెల్యేకు ఈసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి విధేయుడిగా జగన్ వెంటే నడిచిన ఆ ఎస్టీ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోలేదని, ఇప్పుడు ఉన్న సీటు కూడా లేకుండా చేస్తున్నారని ఆయనతో పాటు అనుచరులు కూడా జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ లేనట్లేనని తేల్చి చెప్పినట్లు తెలిసింది.
విజయవాడలో ఎమ్మెల్యేల మార్పుల గురించి సకల శాఖల మంత్రి చూసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో రామకృష్ణారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ లో చర్చించారు. వెలంపల్లిని విజయవాడ సెంట్రల్కు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెస్ట్ నుంచి పోటీలో దింపడానికి ఓ విద్యావేత్త పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీకి ఉన్న ఆదరణ అధ:పాతాళానికి పడిపోగా.. ఈ షఫ్లింగ్తో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోననే ఊహల్లో వైసీపీ అధిష్ఠానం ఉంది.