ఆంధ్రప్రదేశ్ తన భూమిలో తానే మళ్లీ పుట్టాల్సిన పరిస్ధితి వచ్చింది. అయినా బెదిరిపోకుండా మళ్లీ మొదలుకాడ్నించి డెవలప్ చేసుకోవడానికి సిద్ధమైంది. కాని అన్నీ ఆటంకాలే.. అన్నీ సమస్యలే.. అవటానికి అన్నపూర్ణే అయినా.. ఆకలి కేకలు వేయాల్సిన దుస్ధితి వచ్చింది. అన్ని వనరులు ఉన్నా.. ఆదాయం లేక అల్లాడిపోతోంది. అన్ని అవకాశాలు ఉన్నా.. ప్రతి పైసాకు ఆకాశం వంక చూడాల్సిన దారుణ పరిస్ధితి వచ్చింది. ఇందుకు మొదటి కారణం కేంద్రంలోని బీజేపీ. అయితే, ఆ తర్వాత శని పట్టుకున్నట్లు మరింత దారుణ పరిస్ధితి వచ్చింది.. అది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్రెడ్డి వల్ల. కులాల కేకలు.. పథకాల పేరుతో పప్పు బెల్లాలు పెట్టి.. అసలు భోజనం మాత్రం పెట్టకుండా వదిలేసిన పాలకుడు రావడంతో.. రాష్ట్రం త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది.
పదే పదే అంబేద్కర్ను గుర్తు చేసుకోవాల్సిన దుస్థితి
2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పదే పదే అంబేద్కర్ను గుర్తు చేసుకోవాల్సిన దుస్ధితి ఏర్పడింది. రాజ్యాంగంలో ఎవరికి ఏ అథారిటీ ఉందా అని నిపుణులు పుస్తకాలు తిరగేయాల్సిన పరిస్ధితి వచ్చింది. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు అనేది కామన్ అయిపోయింది. కాని రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారినీ లెక్క చేయలేదు. ఆఖరికి హైకోర్టును సైతం ప్రజల ముందు ముద్దాయిలా నిలబెట్టే ప్రయత్నం తీవ్రంగా చేశారు.. చేస్తున్నారు. అంత దారుణంగా రాజ్యాంగం అపహాస్యం పాలైంది. దానిని అమలు చేసే కీలక స్థానాల్లో ఉన్నవారు అవమానాల పాలయ్యారు. అయినా రంకెలేస్తున్న అధికార పార్టీ అహంకారపు రాజకీయ పదఘట్టనల కింద అవన్నీ నలిగిపోయాయే కాని.. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ప్రజలను మాత్రం 2020 కరోనా వైరస్తో పాటు.. మరో వైరస్ గురించి కూడా ఆలోచించేలా చేసింది. ఆ రాజకీయ వైరస్ ఎంత ప్రమాదకారో తెలుసుకునే దిశగా ఇప్పుడు ప్రజలు అడుగులు వేస్తున్నారు.
మూడు రాజధానుల పేరుతో ..
2020 ప్రారంభం అమరావతి ఉద్యమంతో మొదలైంది. అప్పటికే వైసీపీ నాటకాలను గమనిస్తూ పోరాటంలోకి దిగిన అమరావతి రైతులకు.. మూడు రాజధానుల పేరుతో ద్రోహాన్ని తలపెట్టిన జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కాల్సి వచ్చింది. అసెంబ్లీలో వన్ సైడ్ దౌర్జన్యం.. మండలిలో బలం లేకపోయినా ఎదురుదాడి చేసి మరీ సాధించుకోవాలని చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని మామూలుగా ఎగతాళి చేయలేదు. అయినా అందరూ చూస్తూండిపోయారు తప్ప.. మనసుల్లోనే స్పందించారు.. మాటల్లోనే వినిపించారు.. కాని పెద్దగా ఎవరూ రోడ్డెక్కి నిరసన తెలియచేయలేదు.
వైసీపీ బలప్రదర్శన..
ఇక ఆంధ్రప్రదేశ్ లో తర్వాతి ఘట్టం మొదలవ్వటమే వైసీపీ బలప్రదర్శనతో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకప్పుడు పోలింగ్ రోజు జరిగే హింస, దౌర్జన్యాలు ఈసారి నామినేషన్ల రోజే చూడాల్సి వచ్చింది. అధికారుల ద్వారా బెదిరింపులు.. పోలీసుల ద్వారా వార్నింగులు.. అన్ని ప్రయత్నాలు చేశారు. అవేమీ వర్కవుట్ అవకపోతే నామినేషన్ వేసే ఆఖరి క్షణంలో కాగితాలు లాక్కుని చించేసినా కూడా.. ఎన్నికల అధికారులు, పోలీసులు దిష్టిబొమ్మల్లా చూశారంతే. కొందరిని అయితే అసలు నామినేషన్ వేయడానికి రానివ్వకుండా అడ్డుపడి రోడ్ల మీద ఛేజింగ్ కూడా చేశారు. స్వయంగా ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కారులో ఛేజ్ చేశారు, నడిరోడ్డు మీద. అయినా పోలీసులు స్పందించలేదు.
స్థానిక ఎన్నికల్లో అన్ని దౌర్జన్యాలు జరిగినా.. అన్ని ఘోరాలు చూసినా ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైలెంటుగానే ఉండిపోయారు. లోపల లోపల ప్రభుత్వంతో ఏం మాట్లాడారో.. ఏం ప్రశ్నించారో మనకు తెలియదు. కాని జరిగిన దారుణాలపై మాత్రం ఆయన స్పందించలేదు. కాని కరోనాకు స్పందించారు. అప్పటి వరకు ఒక రకమైన కరోనాతో జనానికి కోవిడ్ మరో మహమ్మారిలా వచ్చి పడింది. డిసెంబర్ లోనే బయటపడినా.. ఇండియాలో జనవరిలోనే వచ్చినా.. ఆ ప్రమాదాన్ని గుర్తించడానికి రెండు నెలల సమయం పట్టింది. కేంద్రం డైరెక్షన్తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయదా వేశారు. అంతే జగన్మోహన్రెడ్డి భగ్గుమన్నారు. భూమి మీద ఏం జరిగినా ఆయన చెప్పినట్లే జరగాలనే జగన్.. నిమ్మగడ్డ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడమే కాదు.. సీఎం అయ్యాక తొలి ప్రెస్ మీట్ ఆయనను తిట్టడానికే పెట్టారు. కులాన్ని అంటగట్టి దారుణంగా అవమానించారు. అంతటితో ఆగకుండా ఆయనను తొలగించి.. కొత్త ఎన్నికల అధికారిని పెట్టుకోవడానికి అవసరమైన తతంగాన్ని ఏ నిబంధనను పట్టించుకోకుండా నడిపించగా.. వ్యవహారం కోర్టులకెక్కి మళ్లీ నిమ్మగడ్డ సీట్లో కూర్చోగలిగారు.
తొలగిన భ్రమలు
2019లో మురిపించిన జగన్ మీద భ్రమలు తొలగిపోవడానికి 2020 వేదికగా మారింది. కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమయ్యారు. స్థానిక ఎన్నికలు పూర్తి చేసుకోవాలనే రాజకీయ అజెండా కోసం.. కరోనాను చిన్నది చేసి చూపించడంతో..ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడి.. దారుణంగా నష్టపోయాం. వేలమంది కరోనా బారిన పడి చనిపోయారు. లక్షల మంది కరోనా బారిన పడి ఆరోగ్యం కోల్పోయారు. ఎంతోమంది ఆర్ధికంగా నష్టపోయారు. అయినా జగన్మోహన్రెడ్డికి మాత్రం ఏమీ పట్టలేదు. ఏమీ కానట్లే ప్రవర్తించారు.
వలంటీర్ల వ్యవస్ధ ఓట్ల కోసమే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదనే విషయం మెల్లగా అర్ధమవుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ఒక్క డిపార్ట్మెంట్ కాదు.. అన్నీ వైసీపీ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారు. వాళ్లు అవునన్నవాడే మంత్రి.. కాదన్నవాడు కంత్రీయే. ఓకె చేస్తే పేమెంట్.. లేదంటే పేవ్ మెంట్ మీదకు విసిరేస్తారు. అలా అయిపోయింది పరిస్ధితి.
వైసీపీ నేతల మధ్య గొడవలు
అవినీతి సంపాదనలో పోటీపడ్డ వైసీపీ నేతల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఫిరాయింపులను ప్రోత్సహించనన్న జగన్.. అశ్వద్ధామ హత: కుంజర: టైపులో టీడీపీ ఎమ్మెల్యేలను లాగటం మొదలెట్టారు. కాని వారికి.. లోకల్ వైసీపీ నేతలకు తగాదాలు మామూలుగా జరగటం లేదు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీలో రెండు వర్గాలు తయారయ్యాయి. ఈ రెండూ సంపాదన కోసమే పోటీ పడుతున్నాయి. సంపాదన అవకాశం ఉన్నవాడు రెచ్చిపోతుంటే.. అవకాశం రానివాడు అసంతృప్తితో రగిలిపోతున్నాడు. ఆఖరికి కోర్ టీమ్ అయిన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ల మధ్య కూడా ఈ సంపాదన, డామినేషన్లో వార్ మొదలైంది, పెరిగింది కూడా. అలా రాజకీయంగా వైసీపీ వీక్ అవడం 2020లోనే మొదలైంది. అధికారం ముసుగులో ఆ పగుళ్లు అంతగా అందరికీ కనపడటం లేదు గాని.. అది తీవ్రంగానే ఉంది.
ప్రతి వ్యాపారంలోకి వైసీపీ నేతలు
ఇక అధికారులను చీము, నెత్తురు లేనివారిగా మాత్రం వైసీపీ బాగా తయారు చేసింది. డీజీపీతో మొదలెడితే.. ఆ లిస్టు చాలా ఉంది. అందులో ఫస్ట్ ప్లేస్ మాత్రం ప్రవీణ్ ప్రకాశ్దే. సీఎం తర్వాత సీఎంలా రెచ్చిపోతూ.. అసలైన అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆయన పాపాలను లెక్కేసుకోవడం తప్ప… ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో పడిపోయారా అధికారులు. 2020లో ఈ దారుణ పరిస్ధితి అందరికీ కళ్ల ముందే కనపడింది.. ముందు ముందు మరింత ఘోరంగా మారబోతున్న సంకేతాలు కూడా కనపడ్డాయి. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ప్రతి వ్యాపారంలోకి వైసీపీ నేతలు బలవంతంగా చొరబడ్డారు. ఆదాయాన్ని అర్ధభాగం కాకుండా.. సింహభాగం తమ జేబుల్లోకి వేసేసుకుంటున్నారు.
ఇప్పటికైతే అర్బన్ మిడిల్ క్లాస్ వరకు ఈ పాలన ఎన్నటికి అంతమవుతుందా అని వేయికళ్లతో ఎదురు చూసే పరిస్ధితిలో పడ్డారు. రూరల్ ప్రజలు, అలాగే నవరత్నాల పథకాలు అందుకుంటున్నవారు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అక్కడ కూడా పథకాలు అందనివారు శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. అయితే అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ అన్నీ ఫెయిలైన తాలుకా ప్రభావం గ్రామాల్లో పడినా.. అవి కరోనా అకౌంట్లో పడ్డాయి.. మరికొన్ని రోజులు గడిస్తే వారు కూడా వైసీపీ ప్రతాపం ఎంతవరకో అర్ధం చేసుకునే పరిస్ధితికి వెళతారనడంలో సందేహం లేదు.
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోకేష్
ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అమరావతి ఉద్యమంతో బిజీ అయింది. కాని అనుకున్నంతగా అధికార పక్షాన్ని ప్రతిఘటించడం లేదనే విమర్శలైతే ఉన్నాయి. వరదల సమయంలో లింగమనేని గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో.. కరోనా వచ్చాక చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో ఉండటం పట్ల కూడా విమర్శలొచ్చాయి. ప్రతి ఘటన పట్ల స్పందించడంలో ముందున్నా.. యాక్షన్ ప్లాన్లో వెనకపడ్డారనే మాటలు వినపడ్డాయి. మరోవైపు ప్రతిపక్ష నేతలందరినీ రకరకాలుగా వైసీపీ వేధించడం వల్ల కూడా టీడీపీ వెనకబడిందనే కామెంట్లు వచ్చాయి. స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో వైసీపీ దౌర్జన్యాలను ఢీ అంటే ఢీ అన్నట్లు ఫేస్ చేయలేకపోయింది టీడీపీ. కాకపోతే 2020 ద్వితీయార్ధంలో మాత్రం టీడీపీ పుంజుకుంది. అందుకు కారణం వైసీపీ నుంచి నిర్బంధం మరింత తీవ్రం కావడమే. భౌతికదాడులు కూడా పెరగటంతో.. ఇక ఢీకొట్టకపోతే కష్టమనే అభిప్రాయం టీడీపీ ద్వితీయశ్రేణి నాయకత్వంలో బలంగా వచ్చింది. ఆ ప్రభావం ఇప్పుడు అన్ని జిల్లాల్లో కనపడుతోంది. ఒక దశలో టీడీపీ మళ్లీ పుంజుకోగలదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కాని బీజేపీ వేసిన తప్పటడుగులు.. ఆ అడుగుల్లో అడుగు కలిపిన జనసేన తెలివి తక్కువతనంతో.. మళ్లీ టీడీపీకి రాష్ట్రంలో బోలెడంత స్కోప్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక నాయకుడిగా ఎదగడానికి లోకేష్ చేస్తున్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ కార్యకర్తల్లో ఆశలు రేకేత్తిస్తోంది.
మారిన బీజేపీ ట్రెండ్..
ఇక 2020లో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది అసలైతే బీజేపీ గురించి. జనాలను పిచ్చోళ్లను చేయబోయి వారే పిచ్చోళ్లు అవుతున్న వైనం 2020లో బాగా కనపడుతోంది. అందుకేనేమో చివరికొచ్చేసరికి కాస్త శృతి మార్చారు. అమరావతిపై పోరు చేయాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణను నిర్దాక్షిణ్యంగా పక్కకు తప్పించారు. అది కూడా తప్పిస్తారని విజయసాయిరెడ్డి చెప్పాక. జగన్, విజయసాయిల రహస్య స్నేహితుడు.. వారితో శారదాపీఠంలో స్వరూపానంద స్వామి సమక్షంలో చర్చలు జరిపే సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేశారు. ఇక బీజేపీ ట్రెండ్ మారిపోయింది. వైసీపీని తిడుతూనే జగన్కి అన్ని విధాల సహకరించడం మొదలెట్టారు. మూడు రాజధానుల విషయంలో వేయని డ్రామా లేదు. వ్యతిరేకమంటూనే జగన్కి ఏ దశలోనూ ఆటంకం లేకుండా చూసుకున్నారు. ఆఖరికి ఇప్పుడు న్యాయమూర్తులపైనే ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ రాసి.. దానిని మీడియాలో కావాలని కుట్ర చేసి వదిలినా.. కూడా రాష్ట్రం కోసం ఒక్కో అంశంలో ప్రజల పక్షాన నిలబడ్డ న్యాయమూర్తులను బదిలీ చేసేశారు. ఇవన్నీ వైసీపీ బీజేపీ రహస్య స్నేహం వల్లనే సాధ్యమైందేమో అన్న అనుమానాన్ని స్వయంగా జస్టిస్ రాకేష్ కుమార్ మరో రూపంలో తెలియచేశారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి తమ రాజకీయం కోసం ఏపీని బలిపీఠంపైకి ఎక్కించిన బీజేపీ.. ఏనాటికి ఇక్కడ అధికారం దక్కించుకోలేదేమో అనిపించేలా సోమువీర్రాజు వ్యవహారం నడుస్తోంది. బలపడే అవకాశం వచ్చినా వాడుకోకుండా వైసీపీకి సహకరిస్తూ.. టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయింది ఆ పార్టీ వైఖరి.
మళ్లీ వాయిస్ పెంచిన పవన్
ఇక బోలెడంత ఇమేజ్ ఉన్న జనసేన అయితే పల్టీలు కొడుతూనే ఉంది. అమరావతిని అంగుళం కూడా కదలనీయమని చెప్పిన మరురోజే ఢిల్లీ వెళ్లి బీజేపీతో చేతులు కలిపి.. అమరావతి సంగతి వదిలేసి సినిమాల్లోకి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్. మరి ఎక్కడ తేడా కొట్టిందో గాని.. మళ్లీ ఈ మధ్య ఫుల్లు రేంజ్లో జగన్పై విరుచుకుపడుతున్నారు పవన్ కల్యాణ్. అది కూడా సోము వీర్రాజు మనోభావాలను దెబ్బ తీస్తూ. తిరుపతి ఎంపీ సీటుకు వచ్చిన ఉప ఎన్నిక విషయంలో వచ్చిన విబేధమా.. లేక ఇలాగే సైడైపోతే.. ఇక వాల్యూ ఉండదనే జ్నానోదయం కలిగిందో మరి, పవన్ ఇప్పుడిప్పుడే మళ్లీ వాయిస్ పెంచారు. లేదంటే బీజేపీ చాటు లీడర్గా కనుమరుగైపోవడం ఖాయమే.
ముందుకు రాలేకపోతున్న కాంగ్రెస్, వామపక్షాలు
కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం ఎంత ప్రయత్నించినా.. ఈ రాజకీయాల్లో ముందుకు రాలేకపోతున్నారు. కాంగ్రెస్ మాత్రం చాలా వీక్గా ఉంది. సీపీఎం అయితే దొంగాట ఆడుతూ వైసీపీకి సహకరిస్తున్నట్లు కనపడుతోంది. సీపీఐ మాత్రం అగ్రెసివ్గా .. ఒక విధంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తోంది. అటు సీపీఎం ఆ వైఖరిని.. ఇటు సీపీఐ ఈ వైఖరిని రెండిటిని కొందరు తప్పుబడుతున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయం మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే ఫోకస్ అయింది. ప్రజల్లో వచ్చే అసంతృప్తిని టీడీపీ ఎంతమేరకు ఎలివేట్ చేసి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లగలుగుతుందనేదానిపైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉంది.











