ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేయడం.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రెవేటు పాఠశాలలకు దీటుగా తయారుచేయడం.. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించడం అనేవి దాదాపు ప్రతి పార్టీ కూడా ప్రతిసారీ చెబుతూనే ఉండే విషయాలు. అలాంటి హామీలు జగన్మోహన రెడ్డి కూడా ఎన్నికలకు ముందు అనేకం చెప్పారు. ఆ హామీల అమలులో భాగంగా.. గతంలో కూడా అమల్లో ఉన్న పథకాలను తనదైన శైలిలో మరింత జనాకర్షకరంగా మార్చి, యథోరీతిగా పేరు కూడా మార్చి తిరిగి ప్రారంభిస్తున్నారు. అయినప్పటికీ.. జగన్ పథకాల్లోని కీలకాంశాలు.. శెభాష్ అనిపించేలా ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలనిపించేలా ఉన్నాయి.
దాదాపుగా అన్ని రాష్ట్రాలూ విద్యార్థులకు యూనిఫాం, టెక్ట్స్ బుక్స్ వంటివి ఉచితంగా ఇస్తూనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి విద్యాకానుక పథకంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక విద్యార్థికి చదువుకు సంబంధించి.. ఇక ఆ కుటుంబం ఒక్క రూపాయి కూడా తమ జేబులోంచి వెచ్చించవలసిన అగత్యం లేని పరిస్థితిని జగన్ సృష్టించారు. వీటన్నింటికీ అదనంగా ఎటొచ్చీ.. ప్రతి విద్యార్థి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయల ఉండనే ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పట్ల ప్రజలు మరింతగా ఆకర్షితులు కావడానికి జగన్ అనుసరిస్తున్న ఈ పద్ధతి మంచిదే. ఆయన ఎన్నుకున్న తొలి పద్ధతి ఇంగ్లిషు మీడియం కాగా, దానికి అమలులో కొన్ని న్యాయపరమైన చిక్కులు తప్పలేదు. అదే సమయంలో- కొవిడ్ దెబ్బకు ప్రెవేటు విద్యాసంస్థల దోపిడీ ప్రతి ఒక్కరికీ స్పష్టంగా స్వానుభవంలోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్మిషన్లు పెరుగుతున్నాయి. వాటికి ఈ విద్యా కానుక కూడా తోడవుతుంది.
అంతా బాగానే ఉంది కానీ..
విద్యాకానుక కింద పిల్లలకు ఇన్ని కానుకలు ఇవ్వడం.. అంతా బాగానే ఉంది. చదువుకోవడానికి కావాల్సిన సమస్తం ప్రభుత్వమే అందిస్తోంది. బడికి వచ్చినప్పుడు భోజనం కూడా పెడుతోంది. కానీ అమ్మ ఒడి పేరుతో నగదు బదిలీ అనేది కొంతమందికి జీర్ణం కాని సంగతి.
ప్రభుత్వం అన్నాక కొన్ని నిర్మాణాత్మక మంచి పథకాలతో పాటు ఓటు బ్యాంకు రాజకీయాలకోసం కొన్ని పథకాలను అమలు చేయడం కూడా తప్పనిసరి కావొచ్చు. ఆ క్రమంలో రాష్ట్రంలో మెజారిటీ కుటుంబాలను తమవైపు తిప్పుకోడానికి అమ్మ ఒడి ఒక అద్భుత మార్గంగా కనిపించి ఉండవచ్చు. అయితే పలువురిలో వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు కేవలం.. ప్రెవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇది వర్తింపజేయడం దగ్గరే.
ప్రెవేటు పాఠశాలలు కొవిడ్ అని కూడా చూడకుండా తల్లిదండ్రులను ఎడాపెడా దోచుకుంటున్నాయి. ఆన్ లైన్ తరగతులే జరుగుతున్నా ట్రాన్స్పోర్టు ఫీజు కూడా చెల్లించాల్సిందే అని వేధిస్తున్న స్కూళ్లనూ మనం వార్తల్లో చూస్తున్నాం. అలాంటి వారందరూ.. ‘‘మీరు జేబునుంచి ఇవ్వడం లేదు కదా.. అమ్మ ఒడికింద వచ్చే డబ్బులే కదా’’ అని తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
విద్యాకానుక పథకం వలన.. ప్రెవేటు స్కూళ్లను ఆశ్రయించే పేదలు కూడా.. ప్రభుత్వ స్కూళ్ల వైపు మొగ్గే అవకాశం ఎక్కువ. అదే క్రమంలో అమ్మఒడి వంటి పథకాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ల ప్రాభవం పెరుగుతుంది. నిజానికి జగన్ మదిలో అలాంటి ఆలోచన కూడా ఉన్నదని పార్టీలోని కొందరు పెద్దల ద్వారా తెలుస్తున్నది. ప్రెవేటు స్కూళ్ల తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను వసతులను తయారుచేసిన తర్వాత.. ప్రెవేటు పాఠశాలలకు అమ్మఒడి తొలగిస్తారనే ఒక ఆలోచన పార్టీ వర్గాల్లో ఉంది.
అదే జరిగితే గనుక.. ఇక ప్రెవేటు స్కూళ్ల మాఫియా కుప్ప కూలుతుంది. ప్రభుత్వ స్కూళ్లదే ఏకఛత్రాధిపత్యం అవుతుంది.
విద్యారంగాన్ని సమున్నతంగా చేసే కృషిలో భాగంగా.. జగన్మోహనరెడ్డి అలాంటి నిర్ణయం కూడా తీసుకుంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా.. ‘ఫాలో జగన్’ నినాదం జపిస్తారు. ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుంది.
.. సురేష్ పిళ్లె











