రాజకీయాల్లో ఇది చాలా సర్వసాధారణమైన టెక్నిక్. ఎవ్వడి మీదనైనా సరే, మనకు కిట్టనివాడైతే గనుక, బురద చల్లేయడమే. అది నిజమై ఉండాల్సిన పనిలేదు. మన వంతుగా మనం బురద చల్లేస్తే దాన్ని కడుక్కోవడం అవతలి వాడి ఖర్మ అనే సూత్రం పాటిస్తుంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు.
వైఎస్సార్ కాoగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన నాటినుంచి తెలుగుదేశానికి సంబంధించిన వారిపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం మీద ‘విధ్వంసమార్గం’లో దూసుకుపోతున్నదనే మాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి సమీపంలో గత ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతోనే ఇది ప్రారంభమైంది.
తర్వాత అమరావతిని గాలికొదిలేసి, మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువచ్చారు. తమ ఫోకస్ మొత్తం విశాఖ మీద పెట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించారు. ఆ నగరంపై దృష్టి పెట్టడం అంటే.. ఆ నగరంలో తమకు వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా వినిపించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. అందుకే విశాఖ నగరంలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే స్థానాలనూ తెలుగుదేశం గెలుచుకోగా.. ఆ నలుగురినీ.. తమతో కలిపేసుకోడంపై దృష్టిపెట్టారు. ఒక చేరిక పూర్తయింది. మిగిలినవి ప్రయత్నాల దశలో ఉన్నాయి. మలి అంచెగా- తమ మాట వినే అవకాశం లేని, వ్యతిరేక గళాల గొంతు నొక్కడానికి కాస్త డోసేజీ పెంచారు.. -స్థూలంగా ఇదీ వైసీపీపై ఆరోపణ.
విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ మేయర్ సబ్బంహరి ఇళ్లపై జరిగిన దాడులు, నిబంధనల ఉల్లంఘనల పేరిట చేపట్టిన కూల్చివేతలు ఇలాంటివే. గీతం యూనివర్సిటీ మీద దాడులు కూడా ఈ కోవలోకే వస్తాయి.
గీతం యూనివర్సిటీ సారథి శ్రీభరత్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు. ఈ కారణాల దృష్ట్యా వైఎస్సార్సీపీ ఇతర ఎమ్మెల్యేలను లొంగదీసుకున్నట్లుగా.. బిస్కట్ వేస్తే లొంగే బాపతు కాదు. అందుకే రెండో వైపు నుంచి నరుక్కు వస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
గీతం విశ్వవిద్యాలయ ఆస్తులు, నిర్మాణాలు ఆక్రమణలకు పాల్పడి ఉంటే కూల్చివేయడం అనేది మాత్రమే ఇక్కడ ప్రస్తావన కాదు. కానీ, తమ ఆధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకోవడానికి వారు దరఖాస్తు చేసుకుని ఉండగా.. అర్ధరాత్రివేళ దాడిచేసి కూల్చడం అనేది సమర్థనీయం కాదు. సహజంగానే గీతం వారికి అనుకూలంగా తెదేపా నాయకులు గళమెత్తడమూ, ఆక్రమణల్ని సమర్థిస్తారా? అంటూ వైసీపీ వారు మూకుమ్మడిగా కౌంటర్లు ఇవ్వడమూ ఇదంతా చాలా సహజంగా జరిగిపోయింది. అయితే, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదొకటే సంకేతం కూడా కాదు.
యూనివర్సిటీపై విజయసాయి ఫిర్యాదు..
గీతం విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనల్ని అతిక్రమిస్తున్నదని.. అందుచేత వారి డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాను రద్దు చేయాలని తాజాగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి యూజీసీకి ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలతో సహా మొత్తం 11 అంశాలపై ఆయన ఫిర్యాదు చేశారు.
మొత్తం 11 అంశాలతో ఏకంగా ఏడు పేజీల ఉత్తరాన్ని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్ కు విజయసాయి రెడ్డి రాశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగుల విషయంలో ఎంహెచ్ఆర్డి నిబంధనలు అనుసరించడం లేదని, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తున్నారని, రిజర్వేషన్ పాలసీ గురించి రకరకాల అంశాలను ఆయన యూజీసీకి నివేదించారు.
ఈ సందర్భంగా గీతంలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు. వారి మీద జాలి చూపించారు. వారిని ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేట్ చేయాలని యూజీసీకి- సులువైన పరిష్కారాన్ని కూడా విజయసాయి సూచించేశారు. ఇదంతా చూస్తోంటే.. గీతం విశ్వవిద్యాలయం మీద ఎగస్ట్రా ఫోకస్ తో కక్షసాధింపునకు దిగినట్టు ప్రజలు భావిస్తున్నారు.
ఎంపీ సీటు కోసం వ్యూహాత్మక అడుగులా..
విశాఖ ఎంపీ సీటుపై విజయసాయి కన్నేశారని.. వైసీపీలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు అక్కడ వైసీపీ ఎంపీనే ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల సమయానికి ‘ఆ సీటు నాకు కావాలని’ విజయసాయి పట్టుపడితే.. అడ్డు ఉండకపోవచ్చు. అందుకోసమే.. దానికి తగ్గట్టుగా ఇప్పటినుంచే విజయసాయి పావులు కదుపుతున్నారా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.
అందులో భాగంగా..
- ప్రత్యర్థిని లొంగదీసుకోవడం అనే పని ఎటూ పార్టీ పరంగా చేస్తూనే ఉన్నారు. టీడీపీకి చెందిన నలుగురిలో ఒక ఎమ్మెల్యే వచ్చి చేరారు. మరో ఎమ్మెల్యే చేరడానికి సిగ్నల్ కోసం సిద్ధంగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే సైలెన్స్ పాటిస్తున్నారు. నాలుగో ఎమ్మెల్యే కోసం బేరాలు, మంతనాలు సాగుతున్నాయి. కనీసం బేరం ప్రతిపాదించడానికి, బెదిరించడానికి కూడా వీలు కాని విధంగా, కొరుకుడు పడకుండా ఉన్నది ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాత్రమే అనుకోవాలి. అందుకనే ఈ రకంగా అవతలి నుంచి నరుక్కువస్తున్నారని అనిపిస్తోంది.
- ప్రత్యర్థి ఆర్థిక వనరులను దెబ్బకొట్టడం : శ్రీభరత్ తప్పకుండా రాబోయే ఎన్నికలకు అభ్యర్థి అవుతారనే భావనతో ముందే వారి ఆర్థిక వనరులు అయిన గీతం యూనివర్సిటీ మీద పడ్డారు. ఆక్రమణల కూల్చివేతతో పెద్ద నష్టపోయేదేం ఉండదు. అందుకే అసలు యూనివర్సిటీ హోదానే లేకుండా.. వనరులు నాశనమయ్యేలా ఈ ఫిర్యాదుకు దిగారు అనిపిస్తోంది.
- ప్రత్యర్థి పరువు తీయడం : పనిలో పనిగా ప్రత్యర్థికి ప్రజల్లో ఉండే మంచి పేరును కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుంది. కూల్చివేతల సమయంలోనే ఎన్ని రకాల నిందలు వేయవచ్చునో అన్నీ జరిగాయి. నిబంధనల అతిక్రమణ పేరిట ఇప్పుడు తాజాగా బురద చల్లితే మరింత పరువు పోతుందనే వ్యూహంతో విజయసాయిరెడ్డి ఉండవచ్చు.
అందుకే ఈ లేఖాయణానికి దిగారు. అయితే ఇలాంటి చిన్న చిన్న యుక్తులు పనిచేస్తాయా? విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తున్నందుకు అక్కడి ప్రజలంతా పండగ చేసుకుంటున్నారని ప్రభుత్వం చెబుతుంటుంది. అదే నిజమైతే.. ప్రత్యర్థి ఎంత బలమైన వాడైనా సరే.. ప్రతి ఎన్నికలోనూ తమకే పట్టం కడతారనే ధీమా వారిలో ఉండాలి. విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం నాయకులను దెబ్బ తీయడంపై ఎంతగా వైసీపీ దృష్టిపెడుతూ ఉంటే.. అక్కడ రాజధాని ప్రతిపాదన పట్ల ప్రజామోదం లేదనే భయం వారిలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ముందు ముందు పరిణామాలు ఎలా మలుపులు తిరుగుతాయో చూడాలి.











