పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు ఏపీ సిద్దమవుతోందా? అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మీదకు నెపం నెట్టేసి.. చోద్యం చూడడానికి వైసీపీ సిద్ధమవుతోందా? అని ప్రజలు సందేహిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన బహుళార్థకసాధక ప్రాజెక్టు పోలవరం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సగానికిపైగా కుదించడంతో పోలవరంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు మించి ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం అవుతోంది. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 5 మండలాల్లోని 273 గ్రామాల వారికి పునరావాసం కల్పించడం ఏపీ ప్రభుత్వం వల్ల అయ్యే పనికాదు.
ఏ ప్రాజెక్టు అయినా పునరావాసం, పరిహారం నూరు శాతం పూర్తయితేనే ప్రాజెక్టు ఫలాలు అందుతాయి. కేవలం కాంక్రీటు, మట్టి పనులు పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తి అయినట్టు కాదు. పోలవరం విషయంలో డ్యామ్ పనులు పూర్తి అయినా పరిహారం, పునరావాసం విషయంలో కేంద్రం వ్యయాలకు భారీ కోత పెట్టడంతో ఇక పోలవరం ప్రాజెక్టు కూడా మరో నర్మదా ప్రాజెక్టు కానుందనే సంకేతాలు వస్తున్నాయి.
అవసరం అయితే కేంద్రానికి అప్పగిస్తాం.. మంత్రి బొత్స
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో 12 నీటిపారుదల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించారు. కానీ వాటి పనులు పది శాతం కూడా పూర్తి కాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా ఖచ్చితంగా చెప్పలేం. జాతీయ ప్రాజెక్టు అంటేనే నత్తనడకన పనులు సాగుతాయనే పేరుంది. అందుకే పోలవరం ప్రాజెక్టును ఆరేళ్లలో పూర్తి చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు చేపట్టింది.
2019 నాటికే 71 శాతం పనులు పూర్తి చేసింది. తరవాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఏడాది పాటు పోలవరం పనులు అటకెక్కించారు. ఎట్టకేలకు టెండర్లు పిలిచి మెఘా కంపెనీకి పనులు అప్పగించారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పోలవరంపై ఖర్చు చేసిన రూ.2230 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. అయితే పోలవరం డీపీఆర్ 2ను ఆమోదించిన తరవాతే నిధులు విడుదల చేస్తామని ఆమె కుండబద్దలు కొట్టారు. డీపీఆర్ 2 ప్రకారం అయితే పోలవరం నిర్మాణవ్యయం రూ.20,372 కోట్లు మాత్రమే. పెరిగిన పరిహారం, పునరావాసం ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వ్యయం రూ.55 వేల కోట్లను దాటిపోతోంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనతో ఏపీ ప్రభుత్వ పెద్దలకు మత్తు వదిలింది.
చంద్రబాబునాయుడు వల్లే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,372 కోట్లకు కుదించారని మాజీ సీఎంపై నెట్టే ప్రయత్నం చేశారు. జాతీయ ప్రాజెక్టు అంటే ఖర్చు మొత్తం కేంద్రమే పెట్టుకోవాలి. ఈ విషయంలో బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. తాజాగా ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది.
అవసరం అయితే పోలవరం పనులు కేంద్రానికి అప్పగిస్తామని ఆయన ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి కూడా పోలవరం పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు పోలవరంపై ఏం సమాధానం చెబుతారు. అందుకే పోలవరం కేంద్రం కోర్టులో పడేస్తే.. ప్రాజెక్టు ఆలస్యానికి బీజేపీ, టీడీపీ కారణమని నెపం వారిమీదకు నెట్టేయడం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
జలవనరుల మంత్రికి ఈ విషయం తెలుసా?
పోలవరం ప్రాజెక్టును అవసరం అయితే కేంద్రానికి అప్పగిస్తామని మంత్రి బొత్స ప్రకటించడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అమరావతిని మూడు ముక్కలు చేసే ముందు కూడా మంత్రి బొత్సతో రాజకీయ ప్రకటనలు చేయించారు. నేడు కూడా పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ పెద్దలు కావాలనే బొత్సను రంగంలోకి దింపినట్టు అనిపిస్తోంది.
పోలవరంపై ముఖ్యమంత్రి లేదా, జలవనరుల మంత్రి, కాకుంటే ఆర్థిక మంత్రి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక స్టేట్ మెంట్లు బొత్సతో చేయిస్తున్నారంటే ఇందులో రాజకీయ కోణం ఉంటుందనడంలో సందేహం లేదు.











