కరోనా నియంత్రణ కోసం వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ నియంత్రణ కోసం అనేక కంపెనీలు వ్యాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో ముందంజలో ఉంది. భారత్ బయోటెక్ సిద్ధం చేసిన ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ డోసును కోతులపై ముందుగా ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ వల్ల రోగ నిరోధక శక్తీ గణనీయంగా పెరిగిందని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని భారత్ బయోటెక్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
దీంతో కోవాక్సిన్ యొక్క సురక్షితమైన మానవ ప్రయోజనాన్ని ధృవీకరించే ప్రయత్నాలలో ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సిఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా 12 వైద్య కేంద్రాల్లో మానవులపై వ్యాక్సిన్ను పరీక్షించే వైద్యులకు ఈ అభివృద్ధి బలమైన ధైర్యాన్ని ఇచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సహకారంతో కోవాక్సిన్ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ విజయవంతంగా ఫేజ్-1 పూర్తి చేసుకొని ఫేజ్-2 లోకి అడుగుపెట్టింది. రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తరువాత వైద్యులు తమ పరిశీలన చేశారు. కరోనా నియంత్రణలో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని గుర్తించారు. ఇదే సమయంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోవడంతో వైద్యులు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తం 20 కోతులను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఉన్న ఐదేసి కోతులపై ఇచ్చిన డోసు సమర్థవంతంగా పని చేసిందని వారు ప్రకటన విడుదల చేశారు. ఒక సమూహాన్ని ప్లేసిబోతో నిర్వహించగా, మూడు గ్రూపులు 0 -14 రోజులలో మూడు వేర్వేరు వ్యాక్సిన్ అభ్యర్థులతో రోగనిరోధక శక్తిని పొందాయి. రెండవ మోతాదు తర్వాత 14 రోజుల తరువాత అన్ని కోతులకు కొవాగ్జిన్ ఇచ్చారు. ఆ తరువాత డోస్ పెంచి యాంటీ బాడీస్ ను పెంచడం ద్వారా నిరోధక శక్తీని పెంచగలిగామని ఆ ప్రకటనలో తెలిపారు.
కోతులపై వ్యాక్సిన్ ను ఉపయోగించిన తరువాత వాటి ముక్కు, గొంతు, లంగ్స్ లలో వైరస్ అభివృద్ధి గణనీయంగా తగ్గిందని తాము గుర్తించామని స్పష్టం చేశారు. ప్లేసిబో సమూహానికి భిన్నంగా, టీకాలు వేసిన కోతుల సమూహాలలో హిస్టోపాథలాజికల్ పరీక్ష ద్వారా న్యుమోనియాకు ఎలాంటి ఆధారాలు కనుగొనబడలేదని ఆ సంస్థ వెల్లడించింది. ఫేజ్-1, ఫేజ్-2లలో ఉపయోగించిన వాక్సిన్ ల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని వైద్యులు నిర్దారణకు వచ్చారు. టీకా యొక్క సామర్థ్యాన్ని మ్యాప్ చేసే ఫేజ్ -2 ట్రయల్స్తో ముందుకు సాగడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా( డిసిజిఐ) ఈ నెల మొదట్లో బిబిఐఎల్కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
రెండు ట్రయల్స్ విజయవంతంగా పూర్తి కావడంతో కొవాగ్జిన్ మూడో దశలోకి అడుగుపెట్టనుంది. వ్యాక్సిన్ యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని మానవులపై పెద్ద ఎత్తున పరీక్షించే స్టేజ్ -3 ట్రయల్స్, కోవాక్సిన్ కోసం కీలకమైన పరీక్ష కానుందని డాక్టర్ మిశ్రా చెప్పారు.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన అత్యంత ఆశాజనకమైన వ్యాక్సిన్ కి ప్రతికూల ఫలితాలు వచ్చిన సమయంలో భారత్ బయోటెక్ చేసిన ఈ ప్రకటన ఊరటనిచ్చింది.











