ఏపీలో డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు గత ఐదేళ్ల నుంచి గడ్డు కాలం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగడం లేదు. లేనిపోని నిందలు మోపిన వైసీపీ సర్కారు ఆయన్ను అక్రమంగా సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ ను నిరసిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి.. చివరికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ద్వారా తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయించుకొని ఏబీ వెంకటేశ్వరరావు క్లీన్ చిట్ తో బయటకు వచ్చారు. తన తప్పేదీ లేదని, జగన్ సర్కారు కక్షతోనే తనపై సస్పెన్షన్ విధించిందని ఏబీవీ నిరూపించుకోగలిగారు.
క్లీన్ చిట్ వచ్చి వారాలు గడుస్తున్నప్పటికీ ఏబీవీకి ఇంకా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు. క్యాట్ తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శనివారం (మే 18) లేఖ రాశారు. ఏబీవీ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అయినా తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, న్యాయం చేయాలని లేఖ ద్వారా కోరారు. రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అయిన తన సస్పెన్షన్ చెల్లదని.. చాలా రోజుల క్రితమే క్యాట్ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సంబంధిత డాక్యుమెంట్ ను కూడా జత చేశారు. ఈ లేఖను సీఈవో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. సీఈసీ నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్ లభిస్తుందని భావిస్తున్నారు.
ఐదేళ్ల క్రితం అక్రమంగా ఏబీవీని తప్పించిన వైసీపీ సర్కారు.. నిరాధారమైన ఆరోపణలన్నింటినీ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపింది. అసలు కొనుగోలే చేయని పరికరాల్లో అవినీతి జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపణలు చేసింది. అందుకే సస్పెన్షన్లు విధిస్తూ వేధించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన వెంకటేశ్వర రావుకు ఈ నెల 8న క్యాట్ తీర్పు పెద్ద ఉపశమనం కల్గించింది. తీర్పు వచ్చిన మూడు రోజుల్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఏబీవీ కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరగా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అది తన పరిధిలో లేదని సీఎస్ చెప్పారు. సీఈసీ అనుమతి ఉండాలని చెప్పారు. దీంతో తాజాగా ఏబీవీ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అందులో ఐదేళ్లుగా తాను అనుభవిస్తున్న వేదనను సీఈసీకి వివరంగా తెలిపారు.
నిజానికి ఏబీవీ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. ఎన్నికల కోడ్ వేళ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఈసీ తప్పించింది. అన్ని సవ్యంగా కొనసాగి ఉంటే ఏపీ డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు నియమితులు అయ్యేవారు. కానీ, అప్పటికి క్యాట్ తీర్పు ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత క్యాట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఏబీవీ ఇంకా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.