హీరో సురేశ్ మంచి అందగాడు .. తెలుగు తెరపై ఆయన చాలా విలక్షణమైన పాత్రలను చేశాడు. హీరోగానే కాదు .. విలన్ గాను చేయగలనని నిరూపించాడు. కెరియర్ తొలినాళ్లలో తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్లిన సురేశ్, ఆ తరువాత అక్కడ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేక తెలుగు సినిమాల వైపుకు రావడం విశేషం. నిర్మాతగా నష్టపోయిన ఆయన, ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి చాలా అవస్థలే పడవలసి వచ్చింది. అలాంటి సురేశ్ తాజాగా ‘ఆలీతో సరదాగా’ వేదికగా అనేక విషయాలను ఆవిష్కరించాడు.
చిత్రపరిశ్రమలో కొన్ని అవకాశాలను వదులుకోవలసి రావడం .. అలా వదులుకున్న సినిమాలు భారీ విజయాలను సాధించిన్నప్పుడు బాధపడటం సహజమే. తన విషయంలోను అలాంటివి జరిగాయంటూ సురేశ్ ప్రస్తావించాడు.”భారతీరాజా ‘సీతాకోకచిలుక’ సినిమా కోసం ముందుగా నన్ను అడిగారు. అయితే ఆ సినిమాకి ముందు వేరే సినిమా చేసి ఉండకూడదని అన్నారు. కానీ నేను అప్పటికే ఒక సినిమాను ఒప్పుకున్నందు వలన చేయలేకపోయాను. ముందుగా వేరే వారికి ఇచ్చిన మాటను కాదనలేకపోయాను. అలా ఆ అవకాశం వదులుకోవలసి వచ్చింది.
‘నాలుగు స్థంభాలాట’ సినిమా కోసం జంధ్యాల గారు ముందుగా నన్నే అడిగారు. అంతకు ముందే నేను ఒక సినిమాను ఒప్పుకున్నాను. అందువలన జంధ్యాలగారితో సినిమా చేయలేకపోయాను. ఇక మణిరత్నం గారు కూడా ‘రోజా’ సినిమా కోసం ముందుగా నన్నే అడిగారు. ఆ సమయంలో నేను రామానాయుడుగారి బ్యానర్లో ‘పరువు ప్రతిష్ఠ’ ఒప్పుకున్నాను. అందువలన ‘రోజా’ చేయలేకపోయాను. ‘రోజా’ సినిమా వదులుకున్నందుకు నేను బాధపడలేదంటే అబద్ధం చెప్పినట్టే అవుతుంది. ఈ రోజుకీ ఎక్కడైనా ‘రోజా’ సినిమాలోని పాట వినిపించినా మనసులో ఎక్కడో కలుక్కుమంటుంది” అని చెప్పుకొచ్చాడు.











