ఆంతర్వేది లో రథం దగ్ధం అయిన సంఘటన మరువక ముందే నిన్న విజయవాడలోని నిడమానూరు లో సాయిబాబా విగ్రహం ధ్వoసం, నేడు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి వెండి రధం లోని మూడు సింహాల బొమ్మలు అదృశ్యం వంటి వరుస సంఘటనలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. దీనితో ప్రతిపక్షాలు, హిందు సంఘాలు అధికార వైస్సార్ కాంగ్రెసు పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రధం దగ్దం కావడానికి ముందు పలు దేవాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు అటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఇటు హిందు సంఘాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఈ సంఘటనలు పై భారతీయ జనతాపార్టీ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న మతపరమైన సంఘటనల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి వినతిపత్రాన్ని అందచేయటం ఇప్పుడు చర్చనీయాంశమైనది.
వైకాపాకు గొంతులో పచ్చివెలక్కాయ్..
కేంద్రంలో ని బి.జి.పి. ప్రభుత్వం తో సఖ్యతతో ఉంటున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మింగుడు పడటంలేదు. తమ ప్రభుత్వం పై బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీనితో ఈ ఘటనల వెనుక అదృశ్య హస్తం బీ.జే.పీ.యే అని వైస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల వెనుక బీజేపీ పాత్ర ఉన్నదంటూ కొందరు వైస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
గతంలో సి.పి.ఎం. ప్రభుత్వం అధికారంలో ఉన్న త్రిపుర రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటనలే జరిగాయని, ఆ తర్వాత అక్కడ బీ.జే.పీ పార్టీ అధికారంలోకి వచ్చిందని వైస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో త్రిపుర లో బీ.జే.పీ ఇన్ఛార్జ్గా ఉన్న సునీల్ దియోధర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నారని. దీంతో త్రిపుర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలే ఇలా అంటున్నట్టుగా ప్రచారం జరుగుతుండడమే విశేషం. అయితే.. తాము బీజేపీపై అలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ప్రచారం జరిగిపోతున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు.
ఇక ట్రయాంగుల్ అంతర్యుద్ధం
కాగా ఇప్పటివరకు వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే జరుగుతున్న అంతర్యుద్ధం ఇపుడు వైసీపీ, బీజేపీ పార్టీల మధ్య కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న ఈ సంఘటనల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే భావన లేకుండా రాజకీయపార్టీలు ఈ అంశాలను తమ రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నిచటం శోచనీయం.
తాజాగా జరిగిన విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం కు చెందిన వెండి రధం లోని మూడు సింహంవిగ్రహాలు అదృశ్యంపై ఆలయ ఈ. ఓ. సురేషబాబు ఒక రకం గాను, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరొక విధంగాను వివరణ ఇవ్వడం చూస్తుంటే అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది.
ఈ విధంగా అధికారులు రాజకీయనాయకులు భక్తుల మనోభావాలతో చెలగాట మాడటం సమంజసం కాదని ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలో ఒక మతానికి చెందిన గుళ్ళు, విగ్రహాలు, పడగొట్టటం, రధాలను తగలబెట్టటం వంటి చర్యలు తో భక్తులను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలనుకోవాలని అనుకోవటం ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ విధమైన చర్యలవలన ప్రజలు మరిన్ని ఇక్కట్లకు గురికావలసివస్తుంది.











