సాధారణంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద- ఎడాపెడా విమర్శలు చేయడానికి రాజకీయ నాయకులు జంకుతారు. మన ప్రజాస్వామ్యవ్యవస్థ ఆలోచన దృక్పథంలోనే అలాంటి భావనను నాటి ఉంచుతుంది.
స్పీకరుకు వ్యతిరేకంగా గానీ, రాష్ట్రపతి, గవర్నరు- కోర్టులకు వ్యతిరేకంగా గానీ.. సహజంగా రాజకీయ ఆరోపణలు రావు. కానీ.. రోజులు మారే కొద్దీ.. గవర్నర్ల మీద, ఆ తర్వాతి క్రమంలో స్పీకర్ల మీద ఆరోపణలు మామూలయ్యాయి. వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటూ వచ్చింది. కానీ.. న్యాయవ్యవస్థ డేమేజింగ్ విమర్శలు చాలా అరుదు. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుు సాహసిస్తోంది. డైరక్ట్ గా హైకోర్టు న్యాయమూర్తులు, వారి తీర్పుల సరళి మీదనే ఎటాక్ చేస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజావ్యవహారాల సలహాదారు అయిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి తన తాజా ప్రెస్ మీట్ లో హైకోర్టు తీరుతెన్నుల మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. సజ్జల మాటలను అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మనోభావాలుగానే పరిగణించవచ్చు. వైఎస్సార్ బతికి ఉన్న కాలం నాటినుంచి జగన్ తో అనేక రకాలుగా ఉన్న బంధం కారణంగా.. సజ్జల ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన కోటరీలో ఒకరుగా ఉన్నారు. ఇటీవలి పరిణామాల్లో పార్టీలో ఆయనే నెంబర్ టూ అనే కార్యకర్తలు అనుకునే స్థాయిలో ప్రాధాన్యం పొందుతున్నారు.
అలాంటిది సజ్జల చెప్పిన మాటలను తమ అధినేత చెప్పినట్టుగానే భావించాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సజ్జల హైకోర్టుల మీద విరుచుకుపడేంత ఆగ్రహం తెచ్చుకోవడానికి కారణం.. సీఆర్డీయే మీద కేసులకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులు. సీఆర్డీయే భూ లావాదేవీల్లో జరిగిన అక్రమాలను గుర్తించడానికి ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారం చేసుకుని ఏసీబీకి కేసు అప్పగించిన సంగతి తెలిసిందే. వారు కేసు నమోదు చేశారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎలాంటి సమాచారం మీడియాలో రావడానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అంతో ఇంతో.. సీఆర్డీయే భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రచారం చేస్తున్న వారికి అనుకూలం అనే భావన వారిలో ఉంది. దాంతో సజ్జల ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు.
సజ్జల ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయ వ్యవస్థకు ఉన్న నిష్పాక్షికత మీద నమ్మకం సడలితే.. ఆ వ్యవస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. కొద్దిమందికి ఒకరకమైన న్యాయం.. మిగిలిన అందరికీ ఇంకోరకమైన న్యాయం ఉంటుందా..? అని ప్రశ్నిస్తూనే, మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీం జడ్జి కూతుళ్ళను రక్షించాలి కాబట్టి.. అని ఆరోపించారు. దీని దారం లాగితే చంద్రబాబు వద్దకే వెళుతుందని కూడా ఆయన ఆరోపించారు. అమరావతి స్కాంలో హైకోర్టు తీర్పు కొత్త ప్రిసిడెంట్ తీసుకొచ్చినట్లుగా ఉందన్నారు.
హైకోర్టు తమకు ప్రతికూలంగా ఇచ్చిన ప్రతి తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్లడం అనేది వైసీపీకి అలవాటు అయిపోయింది. సుప్రీంలో పలుమార్లు ఎదురుదెబ్బలే తగిలినప్పటికీ కూడా.. సుప్రీం కు వెళ్లడం మాత్రం వారు మానడం లేదు. తద్వారా హైకోర్టు న్యాయవ్యవస్థ మీదే ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడంలో వైసీపీ సపలం అయిందని కూడా చెప్పొచ్చు. ఈ విషయంలో కూడా సజ్జల అదే మంత్రం పఠించారు. అమరావతి ల్యాండ్ స్కాంపై.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతామని ఆయన అన్నారు.
కక్ష సాధింపా.. లేదా.. అన్నది సీబీఐ విచారణలో తేల్చాల్సిన సమయం ఇది అని వ్యాఖ్యానించారు. తన మీద కక్ష సాధింపు అని చంద్రబాబు అంటే.. అంతా అయిపోయినట్టేనా..!? అని నిలదీశారు. కోర్టులు ప్రీ మెడిటేటెడ్ కు రాకూడదు.. అలాంటి భావన వచ్చేలా ఉన్నత న్యాయస్థానాలు వ్యవహరించడం బాధ కలిగించే విషయం అంటూనే.. కోర్టులపై నిశిత విమర్శలకు దిగారు. ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని సజ్జల అనడం తీవ్రమైన వ్యాఖ్యే.
మీడియాపై, వ్యవస్థలపై గ్యాగింగ్ అన్నది చాలా తీవ్రమైన విషయం… జర్నలిస్టులు, మేధావులు, న్యాయకోవిదులు ఆలోచించాలి అంటూ సజ్జల అనేక విషయాలను ప్రస్తావించారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాటల్లోనే..
- 1.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఇచ్చిన ఆర్డర్ లాంటిది దాదాపు ఎప్పుడూ చూడలేదు. ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. మామూలుగా అయితే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు మీడియాకు సంకెళ్ళు వేయాలని చూడటం, మీడియాకు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని చూడటం, అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం.. మీడియా హక్కులను పరిరక్షించడానికి అండగా నిలవడం.. ఇటువంటి ఘటనలు గతంలో చాలా చూశాం. కానీ, నిన్న రాత్రి హైకోర్టు తీర్పు చూశాక.. ఒక్కసారిగా పరిస్థితి మారిందని అర్థమైంది. పెద్దలైతే ఒక రకమైన తీర్పు.. మరొకరికైతే ఇంకోరకమైన తీర్పా.. అన్నట్టు ఉంది. నిన్న జరిగిన పరిణామాలు కొత్త పోకడగా అనిపిస్తున్నాయి.
- న్యాయవాద వృత్తిలో ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్, అమరావతి ల్యాండ్ స్కాం విచారణలో భాగంగా.. ఆయన కూడా అమరావతిలో భూములు కొన్నారని ప్రాథమిక సమాచారం ఉందంటూ.. ఆయనతో పాటు 12 మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో దేశంలో ఉన్న అత్యంత ఇన్ ఫ్లూయన్స్(పలుకుబడి) ఉన్నశక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యాయి. మేం కోర్టులను ఏమీ అనట్లేదు కానీ.. ఒక స్కాం మీద ఎఫ్ ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) నమోదు అయితే.. అందులో నిందితులుగా ఉన్నంత మాత్రాన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆ శక్తులన్నీ కదిలాయో అర్థం కావటం లేదు. ఇది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించే అంశంకాదు. ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు శిక్షలు పడే పరిస్థితీ ఉండదు. కేవలం నమోదు అయింది ఎఫ్ఐఆర్ మాత్రమే. సహజంగా ఇటువంటి సందర్భాల్లో సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలే ఇంతవరకూ చూశాం. కానీ, ఈ కేసులో.. అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ డీల్స్ కు సంబంధించి.. నిర్దేశిత సమయంలో అప్పట్లో పలుకుబడి కలిగిన వ్యక్తులు కొందరు అక్కడ భూములు కొన్నారని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
- ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇండిపెండెంట్ సంస్థ. దానికి ఆధారం చట్టం ద్వారా ఏర్పడిన సిట్. ఆ చట్టం అంటే జీవో తెచ్చింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అమరావతి ల్యాండ్ స్కాంకు సంబంధించి ఆ సంస్థల విచారణల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు.. దీనివల్ల ఏ ఒక్కరి ప్రతిష్టకు భంగం లేకపోయినా… ఆగమేఘాల మీద నిన్న రాత్రి 9-10 గంటల సమయంలో దీనిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన వ్యక్తులకు, అంశాలకు సంబంధించిన వార్తలు మీడియాలో రాకూడదని, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా రాకూడదని.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిచూస్తే.. ఒక విశేషంగానూ.. ఇది ఒక కొత్త ప్రిసిడెంట్ గా ఉందని మా పార్టీ, ప్రభుత్వం భావిస్తోంది.
- ఈ స్కాంకు సంబంధించి.. ఎవరికో ఏదో చురుక్కుమని అనిపించిందని.. పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యుడికి ఒక న్యాయం ఉంటుందని అనుమానం వచ్చేటట్టు తీర్పు ఉందని భావిస్తున్నాం. ఒక సామాన్యుడి విషయంలో ఇలా చేస్తే బాగుండేది. ఇటువంటి చర్యల వల్ల న్యాయ వ్యవస్థకు ఉన్న నిష్పాక్షికత మీద నమ్మకం సడలితే.. ఆ వ్యవస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప.. వేరేవాళ్ళని నిందించలేం.
- హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిన్న నేషనల్ మీడియాకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు రాజ్ దీప్ సర్దేశాయ్.. సిద్ధార్థ వరదరాజన్ లాంటి వారు ఎంతోమంది ఘాటుగా స్పందించారు. (వాటిని చదివి వినిపించారు)
రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్ః The story that caught my eye: when an aam aadmi is named in FIR, be prepared for worst.. when a khaas aadmi is named, get a gag order asap!
సిద్ధార్థ వరదరాజన్ః RIP AP land scam FIR story.
You lived a short but eventful life.
1000s of FIRs are booked daily, you alone will remain under wraps. Unreported. Uninvestigated.
Real story is this—He who decides how/when this probe proceeds will wield real power in India.
-ఎఫ్ఐఆర్ అయిన వెంటనే స్టే ఇవ్వడం అంటే విజ్ఞులైన పెద్దలు, మేధావులు, న్యాయ కోవిదులు అంతా ఆలోచించాలి.
- అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణలో మాత్రం తొందర లేదు. ఇది కక్ష సాధింపా.. కాదా అని తేల్చాల్సి ఉండగా.. మసిపూసి, మారేడు కాయ చేసి, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని తప్పించాలని చూడటం అంటే.. దొంగలకు రక్షణ ఇవ్వడం లాంటిదే. టీడీపీ కక్ష సాధింపు అని మాట్లాడితే వేరే.. ఎందుకంటే వారు మాకు రాజకీయ ప్రత్యర్థులు. నిత్యం రాజకీయపరమైన మాటలు మాట్లాడుకుంటూనే ఉంటాం. అసలు ఈ కేసులో కక్ష సాధింపా.. లేదా.. అన్నది సీబీఐ విచారణలో తేల్చాల్సిన సమయంలో.. కక్ష సాధింపు అనే వాదనను తీసుకొచ్చి, వాళ్ళను రక్షించడం అంటే ఇంకేముంటుంది..? ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఫలానా వ్యక్తే దొంగతనం చేశాడనే అనుమానం ఉంది. అయితే ఎవరైతే అనుమానితుడో.. అతను కోర్టు ముందుకు వచ్చి నా మీద కోపం ఉంది కాబట్టి, నిందలు వేశాడని, ఆ కేసు చెల్లదని అంటే ఎలా ఉంటుంది…? అసలు తప్పు జరిగిందా.. లేదా అన్నది తేల్చాలి కదా. కోర్టులు కూడా ప్రీ మెడిటేటెడ్ కు రాకూడదంటారు.. అలాంటి భావనకు వచ్చే విధంగా అదికూడా ఉన్నత న్యాయస్థానాలు వ్యవహరించడం బాధ కలిగించే విషయం.
- దర్యాపులు అనేవి కోర్టులు చేయవు కదా.. దర్యాప్తు సంస్థలు దర్యాప్తులు చేస్తాయి. కక్ష సాధింపు అని చంద్రబాబు, ఆయన పుత్రుడు లోకేష్ కూడా అంటారు. వారు అంటే రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అంటారు. అందుకే, దీనికి విరుగుడుగా.. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్వతంత్ర సంస్థ సీబీఐ దర్యాప్తును అడిగాం.. దానిని కూడా వద్దంటారా.. ? చంద్రబాబు మాదిరిగా కేంద్రంతో మేము ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదు. మాకు ఏ ఎన్నికల్లోనూ బీజేపీ పార్టనర్ కాదు కదా. ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత కక్షతో న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పై కేసు పెట్టారు అని వాదిస్తున్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ ఏమైనా.. అలెగ్జాండరా..? లేక వరల్డ్ హీరోనా.. ?. ఆయనపై మాకెందుకు కక్ష..? ఇంకానయం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్ష కట్టారని భావించి ఆయనను చేర్చలేదు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిగారికి ఇదొక్కటే పనా.. ? ఆయన ఒక అడ్వకేట్.. అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్త.. ఆ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్… ఆ తర్వాత అడ్వకేట్ జనరల్.. ఆయన కోర్టును కదిలించడం ఏమిటి.. ? ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. గంటకు లక్షల్లో.. రోజుకు కోట్లల్లో ఫీజులు తీసుకునే ముఖుల్ రోహిత్గీ లాంటి న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగాడు.. మరి ఆయన ఉచితంగా చేస్తున్నాడో.. మాకైతే తెలియదు..
- ఇదిఇలా ఉంటే.. టీడీపీలో పలు హోదాలో ఉన్నాం అంటూ… వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు అమరావతి భూముల స్కాంకు సంబంధించి, ప్రభుత్వం వేసిన సిట్, క్యాబినెట్ కమిటీలకు సంబంధించిన రెండు జీవోలను రద్దు చేయమని ఒక రిట్ వేస్తే.. అందులోనూ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం వైపు నుంచి మేం అనుబంధ పిటీషన్ లో.. దీనిపై సీబీఐ విచారణను అడిగాం. అడిగి నెలలు అవుతుంది. వాళ్ళను కూడా ప్రతివాదులుగా చేర్చండి అని అడిగాం.. కానీ దీనిని డిస్మిస్ చేశారు. అమరావతి భూముల స్కాంపై అసలు దర్యాప్తే వద్దంటారా..?
- చిత్రం ఏమిటంటే.. నిన్న రాత్రి న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కేసు 7.30 గంటలకు హౌస్ మోషన్ కింద రావొచ్చేమో అని తెలిస్తే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా.. నిన్న సాయంత్రం 5, 5-30 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి .. రేపు సిట్ దర్యాప్తు ఫైనల్ జడ్జిమెంటు రెడీగా ఉందని చెబుతాడు.
- ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి…? ఒక వ్యక్తి స్వేచ్ఛను, అమాయక ప్రజల హక్కులను హరించినా.. న్యాయానికి అవకాశం లేని అసక్తులపై దౌర్జన్యం చేసినా.. హైకోర్టు ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. అలాంటిది మీడియాకు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం అంటే.. మాట్లాడకుండా నోరు కట్టేయడం, నోరు బిగించడం.. ఇది ఓవర్ రియాక్షన్ లా అనిపిస్తుంది.
- మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్ళు ఉన్నారని, ఇందులో ముందుకు వెళ్ళకూడదని వీళ్ళు హైకోర్టును అడిగారట. కోర్టు విచారణ తర్వాత.. వారు ఏమైనా చేసి ఉంటే.. ఆ డీడ్స్ ను ఎవరూ ప్రశ్నించకూడదా.. దర్యాప్తు సంస్థలు విచారణకు తీసుకోకూడదా.. ? న్యాయం ఎక్కడ..? కొద్దిమందికి ఒకరకమైన న్యాయం.. మిగిలిన అందరికీ ఇంకోరకమైన న్యాయం ఉంటుందా.. ?
- 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అమరావతి రాజధాని అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. ల్యాండ్ పూలింగ్ పేరుతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ విషయాన్ని మేము చెబుతూనే వస్తున్నాం. 2019 ఎన్నికల్లోనూ మేం ఆ విషయం చెప్పి ఎన్నికలకు వెళ్ళాం. మేం అధికారంలోకి వచ్చాక.. కచ్చితంగా అమరావతి రాజధాని భూముల మీద విచారణ జరిపిస్తాం అని చెప్పాం. దీనికి లాజికల్ ఎండ్ కు పుష్ చేస్తాం అని చెప్పాం. దానిమీదే ప్రజలు తీర్పు ఇచ్చారు. 151 సీట్లతో జగన్ గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. 51 శాతం ఓట్లతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా.. గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే, ఆ తప్పులు మీద, వారు చేసిన అక్రమాల మీద విచారణ చేసే హక్కు ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేరు.
- అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్ళు, మాజీ అడ్వకేట్ జనరల్.. వీళ్ళంతా ఉన్నారు కాబట్టి… వాళ్ళను రక్షించాలి.. దీని దారం పట్టుకుని లాగితే చివరకు చంద్రబాబు దగ్గరకు వెళుతుంది. ఇందులో ఎవరైతే తప్పులు చేశారో.. ఈ శక్తులు విజయం సాధిస్తున్నారనే బాధ . అనుమానం కలుగుతుంది.
- కచ్చితంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళతాం. హైకోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకుంటే.. ఇక ఎవరూ అమరావతిపై నోరు ఎత్తటానికి వీల్లేదు. గ్యాగింగ్ చాలా తీవ్రమైన విషయం.. గ్యాగింగ్ మీడియా, గ్యాగింగ్ సిస్టమ్, గ్యాగింగ్ ఎగ్జిక్యూటివ్, గ్యాగింగ్ లెజిస్లేచర్, గ్యాగింగ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీస్.. వీటన్నింటిపై విజ్ఞులైన ప్రజలు, మేధావులు, న్యాయ కోవిదులు మాట్లాడాలి. టెక్నికల్ గా తెలియకపోయినా.. సహజమైన న్యాయం అనేది ఒకటి ఉంటుంది. దానికి కూడా ఇది రుచించడం లేదు.