అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి అడుగు పడింది. అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో లాంటి దిగ్గజ సంస్థలు ఏపీ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందంలో భాగంగా..టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం.. భారతదేశంలోనే మొట్టమొదటి, అత్యంత శక్తివంతమైన ‘క్వాంటం సిస్టం 2’ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే, ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం ఏపీకే కాదు, దేశానికే చారిత్రాత్మకమైన రోజు అన్నారు. భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందన్నారు చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, దీన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, ఎల్&టీకి ఇప్పటికే స్థలం కేటాయించామని తెలిపారు.
ఇండియాలో ఐబీఎం క్వాంటం సిస్టం 2ను స్థాపించడం దేశ క్వాంటం ప్రయాణంలో కీలక మలుపు అన్నారు IBM క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా. ఈ భాగస్వామ్యం క్వాంటం అల్గారిథమ్ల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. క్వాంటం, క్లాసికల్ వ్యవస్థల అనుసంధానంతో జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు TCS CTO డాక్టర్ హారిక్ విన్.