ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళల కోసం, వారి రుణాల చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలకు మరింత సులువుగా వేగంగా సేవలు అందించే వెసులు బాటు కలిగింది. ఈ నేపథ్యంలోనే డ్వాక్రా మహిళలకు కూడా శుభవార్త చెప్పింది. ఇకపై డ్వాక్రా మహిళలు ఇంటి వద్ద నుండి డ్వాక్రా రుణాలు, పొదుపు చెల్లింపులను చేయడం కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
సాధారణంగా డ్వాక్రా మహిళలు రుణ వాయిదాల చెల్లింపులు చేయడానికి ప్రతి నెల ఒకరికి బాధ్యత అప్పగిస్తారు. ఆ మహిళలు అందరి వద్ద నుండి డబ్బులు కలెక్ట్ చేసి బ్యాంకుకు వెళ్లి క్యూలైన్లో నిలబడి రుణ వాయిదాలను చెల్లింపు చేయాలి. దానికి వారికి ఆ రోజంతా బ్యాంకులోనే సరిపోతుంది. ఈ క్రమంలో ఈ సమస్యలను అధిగమించి మహిళలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభం చేసే విధంగా ఓ యాప్ ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మొబైల్ యాప్ తో డ్వాక్రా గ్రూపుల మహిళలు నేరుగా రుణ చెల్లింపులను చేయవచ్చు.
ఈ యాప్ అందుబాటులోకి వస్తే బ్యాంకులకు వెళ్లకుండా ఇంటి నుండే వారు సులభంగా రుణ చెల్లింపులను చేసుకోవచ్చు. యాప్ని వినియోగించడం వల్ల డిజిటల్ లావాదేవీలను కూడా ప్రోత్సహించవచ్చు. కొన్ని సందర్భాలలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు రుణాలను చెల్లింపు చేయడానికి వసూలు చేసిన డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడం, వాటిని దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం నగదు బదిలీ మోసాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది .ఇక ఇంట్లో నుండి నేరుగా చెల్లింపులు చేయడంతో డ్వాక్రా మహిళల సమయం కూడా ఆదా అవుతుంది. త్వరలోనే ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తోంది.