జగన్ సర్కార్కు, రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్కు మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం రెడ్ సిగ్నల్ వేస్తే.. ఎన్నికల కమిషన్ మాత్రం ఫిబ్రవరిలో జరపడానికి సన్నాహాలు చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్లో రిట్ అప్పీల్ వేసింది ఎస్ఈసీ. వ్యాక్సినేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డురాదన్న కోర్టుకు తెలిపిన ఎస్ఈసీ. కానీ, రాష్ట్రంలోని ఉద్యోగులంతా వ్యాక్సినేషన్ ఏర్పాట్లలో ఉన్నారని, కాబట్టి ఎన్నికల నిర్వహణ కుదరదన్న ఏజీ శ్రీరామ్.
గురువారం నాడు స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ముఖ్యమేననీ, రెండింటినీ సమన్వయపరచుకుంటూ వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును, డివిజనల్ బెంచ్ కొట్టి వేసింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ను హైకోర్టు అనుమతించింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. వేటీనీ వాయిదా వేయడానికి కుదరదని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్రానికి తెలిపింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగినపుడే అన్ని వ్యవహారాలు చక్కబడతాయని సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.