రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ దుర్గగుడి రథంపై ఉంచిన 3 వెండి ప్రతిమల ఛోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వెండి ప్రతిమలు ఛోరీకి గురయ్యాయని ఆలస్యంగా గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను నియమించారు. 41 మంది పాత నేరస్థులను విచారించినా ప్రయోజనం దక్కలేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ దొంగతనం కేసులో బాలకృష్ణ అనే నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేసి, విచారించారు. ఆ సమయంలో దుర్గగుడి రథంపై 3 వెండి ప్రతిమలను దొంగిలించినట్టు బాలకృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తుని పోలీసులు విజయవాడలో దుర్గగుడి వెండి సింహాల ఛోరీ కేసును దర్యాప్తు చేస్తున్న వారికి సమాచారం అందించారు. నిందితుడుని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వెండి సింహాల ఛోరీ కేసులో కీలక నిందితుడు దొరికినట్టయింది.

ఎట్టకేలకు దొంగ దొరికాడు
విజయవాడ దుర్గగుడి వెండి సింహాల ఛోరీ కేసును 8 నెలల పాటు శోధించిన పోలీసులు దాదాపు చేతులెత్తేశారు. ఈ సమయంలో వేరే దొంగతనం కేసులో విచారణలో ఉన్న నేరస్థుడు వెండి సింహాలను కూడా తానే కాజేసినట్టు అంగీకరించడంతో కేసు కొలిక్కి వచ్చింది. 16 కిలోల 3 వెండి సింహాల ప్రతిమలను కరిగించి తునిలో ఓ జ్యుయలరీ షాపులో విక్రయించినట్టు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. అక్రమ వెండిని కొనుగోలు చేసి జ్యుయలరీ షాపు యజమానికి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో దుర్గగుడి వెండి సింహాల ఛోరీ కేసు కొలిక్కివచ్చినట్టయింది.
Must Read ;- కేసుల్లో పురోగతికి కేంద్రం జోక్యమే కారణమా?











