మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్, అమృతల ప్రేమకథ గురించి అందరికీ తెలుసు. ఈ సినిమా నిర్మాతలకు మంచి కథా వస్తువు కావడంతో అందరి దృష్టీ దీనిపైనే ఉంది. ఇందులోని మరో కోణంతో రాంగోపాల్ వర్మ సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీనికన్నా ముందే ఈ కథ వస్తువును తీసుకుని నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) కూడా సినిమా రూపొందించారు. అదే ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ చిత్రం. ఇందులో అమృత పాత్రను అర్చన పోషిస్తే, ప్రణయ్ పాత్రను బాలాదిత్య పోషించారు. వీరి ప్రేమలోని ఓ కోణాన్ని ఇందులో చూపించారు.
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎం.ఎన్.ఆర్.చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్నివిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను ఈ సినిమాలో చూపించాం. బాలదిత్య, అర్చనల మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు యూత్ టార్గెట్ గా ఉంటాయి.’ అని వివరించారు.
టీజర్ కు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. శ్రీలక్ష్మీ,ప్రభ, జయంతి,సుధ, సంగీత, జయవాణి తదితరులు ఇందులో నటించారు. విడుదల చేసిన టీజర్ లో ఉన్న డైలాగ్ లోనే దర్శకుడు ఈ సినిమా ఏమిటో చెప్పారు. ‘ప్రేమ ప్రాణం ఇవ్వదు.. ప్రాణం తీస్తుంది..’ అని విలన్ అంటే హీరో బాలాదిత్య ‘ప్రేమ ప్రాణం తీస్తుందా.. ఇస్తుందా అని ఎవ్వడూ ఆలోచించి ప్రేమించడు’ అని జవాబిస్తాడు. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.