తెలంగాణలో ఖాళీ కాబోతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధమవుతోంది. గతంలోనూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపొందడమో. రెండోస్థానంలో నిలవడమో జరగడంతో. ఈసారి రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇక పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీ అయిపోయింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. మహబూబ్ నగర్. రంగారెడ్డి. హైదరాబాద్ స్థానానికి సిటింగ్ ఎమ్మెల్సీనే నిలబెట్టే అవకాశం ఉంది. ఇక్కడ పెద్దగా పోటీ కూడా లేక పోవడంతో రూట్ క్లియర్ అయినట్టే భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఆశావహుల జాబితా చాలానే ఉంది. చాలా మంది అభ్యర్థులు తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతుండటం. ఇలా కోరుకునే వారంతా పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నవారే కావడంతో పార్టీలో ఉత్కంఠ చోటుచేసుకుంటోంది. దీంతో టికెట్ ఎవరికి కేటాయించాలన్న దానిపై ముల్లగుల్లాలు పడుతున్నారు పార్టీ నేతలు.
తలపడుతున్న సీనియర్లు….
బీజేపీలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి తాజా మాజీ ప్రధనా కార్యదర్శులు, ఊపాధ్యక్షులు ,ఇతర సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ సీనియర్లు ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, పేరాలశేఖర్ వంటి సీనియర్లు తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరంతా ఏబీవీపీ నుంచి పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. విద్యార్థి సంఘం నుంచే వీరంతా వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. తాజాగా బీజేపీలో కీలక పదవులు చేపట్టిన వారే కావడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి. దీంతో రాష్ట్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. తమకే టికెట్ కేటాయించాలంటూ నాయకత్వానికి బలంగా చెబుతున్నప్పటికీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు నేతలు. టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో కొందరికి పార్టీ పదవులు ఉండటంతో వారికి కాకుండా తమకే టికెట్ ఇవ్వాలంటున్నారు మిగిలిన నేతలు చెబుతున్నారు.
ఇంత డిమాండ్ కు కారణమేంటీ….
టికెట్ కు ఇంతలా పోటీ పెరగడానికి కారణం మరొకటి కూడా ఉందంటున్నారు పార్టీ నేతలు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం… ప్రస్తుతం పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో. ఇప్పుడు నిలబడితే గెలుపు కోసం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని…అందుకే బరిలో దిగాలనుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని అంటున్నారు. గతంతో పోల్చితే పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది.. ఏ చిన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినా భారీగా ప్రజలు తరలి వస్తుండటంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు టీఆర్ఎస్ పై కోపంగా ఉండటం… బీజేపీ పట్ల యువత ఆకర్షితులవుతున్నారన్న భావన బీజేపీలో బలంగా ఉంది. దీంతో ఆ నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్ననేతలను బుజ్జగించి ఎవరికి టికెట్ ఇస్తారోనన్న ఆసక్తి పార్టీ నేతల్లో ఉంది. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరినీ కలుపుకొంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది. మరి ఆ టికెట్ దక్కించుకునే నేత ఎవరో? అభ్యర్థి గెలుపునకు మిగతా నేతలు ఏ మేరకు సహకరిస్తారో వేచి చూడాలి.