టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఏదైనా ఒక పనిని తన భుజానికెత్తుకున్నారంటే… ఆ పని పూర్తి అయి తీరాల్సిందే. అంతేనా… దాని నుంచి చంద్రబాబు ఆశిస్తున్న దానికంటే కూడా అధికంగానే రిజల్ట్ కూడా వస్తోంది. చంద్రబాబును కాస్తంత లోతుగా గమనిస్తున్న వారెవరైనా ఈ విషయం ముమ్మాటికీ నిజమేనని ఒప్పుకుని తీరతారు. అయినా ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే… చంద్రబాబు ప్రస్తుతం అరకు బ్రాండ్ వాల్యూను పెంచడమే లక్ష్యంగా సాగుతున్నారు. అరకు బ్రాండ్ అంటే… అక్కడి గిరిజనులు పండించే పంటల ఉత్పత్తుల ప్రమోషన్ అన్నమాట. వీటిలో అరకు కాఫీకి ప్రత్యేక స్థానముందని చెప్పక తప్పదు.
అరకు కాఫీ రుచిని ఒక్కసారి చూశారంటే… దాని రుచికి మైమరచిపోవడంతో పాటుగా,… దాని రుచిని ఎప్పటికీ మరువలేమంటూ అందరూ చెబుతున్న మాట తెలిసిందే కదా. అలాంటి సుమధురమైన అరకు కాఫీని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా విదేశాలకూ పరిచయం చేసే దిశగా చంద్రబాబు ఓ బృహత్కార్యాన్నే తన భుజాలకు ఎత్తుకున్నారు. ఇటీవలి చంద్రబాబు పర్యటనలు, సమావేశాల తీరును పరిశీలిస్తున్న వారంతా ఇదే మాట చెబుతున్నారు.
ఆరు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నడూ లేని రీతిలో టీడీపీ ప్రచారంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా నాడు విశాఖ వెళ్లిన భువనేశ్వరి.. ఓ సందర్భంలో విశాఖలో అరకు కాఫీని సేవించారట. ఆ రుచికి మైమరచిపోయిన ఆమె… ఆ కాఫీ సేవిస్తూనే తన భర్త చంద్రబాబుకు ఫోన్ చేశారట. ఇదేదో అరకు కాఫీ అంట..మన గిరిపుత్రులే పండిస్తున్నారట… రుచి మాత్రం ఆమోఘంగా ఉంది… దీనిని దేశవ్యాప్తంగా వినియోగించేలా చేయండి అంటూ ఆమె చంద్రబాబును కోరారట.
ఆ తర్వాత ఇటు చంద్రబాబుతో పాటు అటు భువనేశ్వరి… టీడీపీ నేతలు… ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీల నేతలంతా ప్రచారంలో పడిపోయారు. ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు మరోమారు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆ వెంటనే తన సతీమణి చెప్పిన మాటలను మరోమారు గుర్తు చేసుకున్న చంద్రబాబు… అరకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని తీర్మానించుకున్నారు.
సాధారణంగా చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా… ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిసే సమయంలో వారికి ఏ వెంకటేశ్వర స్వామి ప్రతిమనో, లేదంటే అమరావతి చిత్రపటాన్నో ఇచ్చి వారిని సత్కరించేవారు. తాజాగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు…బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అయ్యారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోల్లో చంద్రబాబు తాను కలిసిన ప్రముఖులకు అందంగా తీర్చిదిద్దిన రెండు ప్యాకెట్లను ఇస్తూ కనిపించారు. ఆ ప్యాకెట్లు ఏమిటా? అంటూ అందరూ ఆసక్తిగా గమనించారు. తాజాగా ఆ బాక్సులేమిటన్నది తేలిపోయింది. అవన్నీ.అరకు కాఫీ పొడితో నిండిన అందమైన ప్యాకేజీతో కూడిన ప్యాకెట్లు అంట. అంటే… తన సతీమణి చెప్పినట్లుగా అరకు కాఫీని చంద్రబాబు… దేశంలోని అన్ని ప్రాంతాల ప్రముఖులకు చేరేలా ఈ ప్యాకెట్ల బహుమతులను ఎంచుకున్నారట.
ఇదిలా ఉంటే.. అమరావతికి వస్తున్న ఇతర రాష్ట్రాలు, ఆయా కంపెనీల ప్రతినిధులు, విదేశాలకు చెందిన ప్రముఖులకు కూడా చంద్రబాబు ఇవే గిఫ్గులను అందజేస్తున్నారట. ఇటీవలే జపాన్ కు చెందిన ప్రతినిధి బృందం అమరావతి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారంతా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం జపాన్ ప్రతినిధులందరికీ… తలా రెండు ప్యాకెట్ల చొప్పున ఈ అరకు కాఫీ ప్యాకెట్లను అధికారుల చేత అందించారట. మొత్తంగా ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు… తాను కలలు గంటున్న అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే… అరకు బ్రాండ్ కూ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారన్న మాట











