ఏపీకి అత్యంత కీలకమైన 972 కిలోమీటర్ల తీర ప్రాంతం క్రమేణా చేజారుతోందా.. ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి పోర్టులు వెళ్తున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు ఏపీలో మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ ప్రైవేటుకి అప్పజెప్పడాన్ని బట్టి ఈ చర్చ నడుస్తోందని చెప్పవచ్చు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టు, రామాయపట్నం పోర్టులతో పాటు ఇసుక రీచ్లనూ అరబిందో కంపెనీకి అప్పజెప్పింది. మరోవైపు విశాఖ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం ఖాయమని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ మాత్రమే కావాలని విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఏపీలో రెండో అతిపెద్ద పోర్టుగా ఉన్న గంగవరం పోర్టు కూడా అదానీ పరమైంది. కొన్నాళ్ల క్రితమే ఏపీలోని కృష్ణపట్నం పోర్టును అదానీ పోర్ట్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు గంగవరం పోర్టునూ దక్కించుకుంది. దీంతో దేశానికి తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో అదానీ గ్రూపు అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. ఆ క్రమంలో భారత్ లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్గా అదానీ గ్రూపు మారేందుకు మరో అడుగుపడిందని చెప్పవచ్చు.
గంగవరం పోర్టులో..
గంగవరం పోర్టులో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా చేజిక్కించుకుంది అదానీ గ్రూపు. ఇందు కోసం రూ.3,604 కోట్లతో ఒప్పదం కుదిరినట్టు అదానీ గ్రూపు ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఈ పోర్టులో ఉన్న 31.5శాతం వాటా ఉన్న వార్బర్గ్ సంస్థ నుంచి ఇప్పటికే రూ.1954కోట్లు వెచ్చించి ఆ వాటాలనూ దక్కించుకుంది అదానీ పోర్ట్స్ సంస్థ. దీంతో గంగవరం పోర్టులో అదానీ గ్రూపు వాటా 89.6 శాతానికి చేరనుంది. కాగా 9 బెర్త్లు ఉన్న ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. డీప్ వాటర్ పోర్టు కావడంతో అంతర్జాతీయ ఎగుమతులకు, దిగుమతులకు, సూపర్ కేప్ సైజ్ నౌకల రాకపోకలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. దేశంలోని దాదాపు పది రాష్ట్రాలకు చెందిన సరుకులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. ఈ పోర్టులో ఏపీ ప్రభుత్వం వాటా 10.4శాతం ఉంది.

పోర్టులపై ఆధిపత్యం..
కాగా అదానీ గ్రూప్ గతంలో కేవలం గుజరాత్కే పరిమితమైంది. గౌతమ్ అదానీ సారథ్యంలో ఈ గ్రూపు నడుస్తోంది. గత ఏడాది కృష్ణపట్నం పోర్టును రూ.12వేల కోట్లతో కొనుగోలు చేసింది. ఇటీవలే మహారాష్ట్రలోని డిఘి పోర్టును చేజిక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా అదానీ గ్రూప్ చేతుల్లొనే ఉంది. 2006లో పది మిలియన్ల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న పోర్టు అధిపతిగా ఉన్న అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ గత నెల నాటికి దాదాపు 500 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 12 పోర్టుల అధిపతిగా ఎదిగారు. ఇక వ్యాపార లావాదేవీలు ఎలా ఉన్నా.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు అంబానీ, అదానీల వ్యాపారాల విస్తరణ వేగంగా జరుగుతోందని చెప్పవచ్చు.











