ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్న కొద్దీ.. ప్రజల్లో అనుమానం భయం పెరుగుతోంది. ఇదంతా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలోనే. సాధారణంగా.. ప్రజల్లో ఏ విషయంలో ఎన్ని రకాల భయాలు రేకెత్తినా సరే, సీఎం జగన్ స్వయంగా వివరణ ఇవ్వడానికి గానీ, ప్రభుత్వ విధానం ఏంటో తాను స్వయంగా ప్రజలకు తెలియజెప్పడానికి గానీ.. ఎన్నటికీ పూనుకోరు. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా మాత్రం తటస్థిస్తుంటాయి. జగన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి గానీ, అధికార్లతో రివ్యూల్లో గానీ.. ఒక విషయంపై వివరణ ఇచ్చారంటేనే దాని అర్థం.. అది అప్పటికీ చేయిదాటిపోయినంత సీరియస్గా మారిందని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆయన మీటర్ల గురించిన భయాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. వ్యవసాయ విద్యుత్తుకు పూర్తిగా కరెంటు ఉచితంగా ఇవ్వాలనేది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన. కేవలం అలాంటి ఒక్క పథకంతోనే.. ఆయన రైతు బాంధవుడిగా ముద్ర పడ్డారు. ఆ ఒక్క పథకం.. 2004లో వైఎస్సార్ ను ముఖ్యమంత్రి పీఠం మీదికి తీసుకురావడంలో చాలా ఉపయోగపడింది. రైతుల విషయంలో వైఎస్సార్ చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉచిత కరెంటు గురించి అందరూ ఇవాళ్టికి కూడా చెప్తుంటారు. అలాంటి ఉచిత విద్యుత్తుకు ఇప్పుడు జగన్ పాలనలో ప్రమాదం పొంచి ఉందేమోనన్న అభిప్రాయం, భయం రైతుల్లో కలుగుతోంది.
మీటర్లు బిగించడం అనగానే.. ఏదో ఒక రీతిగా ముందు ముందు ఇబ్బంది తప్పదనే భయం అందరిలోనూ ఉంది.
ఈ విషయంలో ఇప్పటికే ప్రజలకు వివిధ రకాలుగా వివరణ ఇవ్వడానికి వైసీపీ నాయులు, మంత్రులు చాలా మంది ప్రయత్నించారు. కానీ రైతుల్లో భయాలు తగ్గలేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా కాకపోయినా, విద్యుత్ అధికార్ల సమీక్ష సమావేశం రూపేణా.. ఈ విషయంలో తన వివరణ ఇచ్చారు.
‘‘మీటర్ల వల్ల రైతులకు ఒక్కరూపాయి కూడా అదనంగా భారం పడదు’’ అని జగన్ చెప్పుకొచ్చారు. నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని, వారు డిస్కంలకు చెల్లిస్తారని అన్నారు. అయితే ఇది రైతులు డ్రా చేసుకోడానికి వీల్లేని ఎస్క్రో ఖాతాల ద్వారా.. అనే సంగతి ఆయన తనంతగా చెప్పలేదు. చెల్లింపు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రైతుల్లో నిజానికి ఉన్న భయాలు వేరు.
రైతులకు ఒక్కరూపాయి కూడా భారం పడదు.. అని తొలినుంచి చెబుతూనే ఉన్నారు. కానీ.. ‘‘ఒక్క రైతుకు కూడా ఉచితవిద్యుత్తు తొలగించడం జరగదు’’ అనే మాట ప్రభుత్వ పెద్దలనుంచి స్పష్టంగా రావడం లేదు. మీటరింగ్ అనేది రాగానే.. దానికి ఒక శ్లాబ్ సిస్టమ్ పెడతారని, సంపన్న వర్గాల రైతులను వివిధ ప్రామాణికాల ప్రకారం గుర్తించి.. క్రమక్రమంగా.. వారికి ఉచిత విద్యుత్తు తొలగిస్తారనే భయం ఉంది. ఈ ఒక్క భయం గురించి మాత్రం ప్రభుత్వం పెద్దలు ఎవ్వరూ స్పష్టత ఇవ్వడం లేదు. చివరికి అధికార్లతో సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టత ఇవ్వలేదు. రైతుకు ఒక్కరూపాయి కూడా భారం పడదు అంటున్నవారు.. ఒక్క రైతుకు కూడా ఉచిత విద్యుత్తు తొలగించడం జరగదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రజలు దేని గురించి ప్రధానంగా భయపడుతున్నారో.. ఆ భయాన్ని ఎందుకు నివృత్తి చేయలేకపోతున్నారు.. అనేది కీలకాంశంగా ఉంది.
అందుకే సీఎం వివరణ పూర్తయినా కూడా.. ఇప్పటికీ ప్రజల్లో భయం తొలగడం లేదు. రైతు పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దలు ఈ భయాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారో తెలియడం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకాస్త స్పష్టత ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.