ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో గుడ్న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం పథకం ఇవాల్టి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలోనూ తల్లికి వందనం నిధులను జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం సూచించారు.
ఇక గురువారం నుంచి రాష్ట్రంలోని 67 లక్షళ 27 వేల 164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం అవసరమైన రూ.8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతోపాటు ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకూ పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో పోలిస్తే ఈ సారి లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లు మాత్రమే అమ్మఒడి అమలు చేసింది. 2022-23లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు జమ చేసినట్లు ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంలో లబ్ధిదారులు 67,27,164 మంది ఉన్నారు. గతంతో పోల్చితే లబ్ధిదారులు 24,65,199 మంది పెరగ్గా నిధుల వ్యయం రూ.2,352.06 కోట్లు పెరిగింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది కూటమి సర్కార్. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పెంపును అమల్లోకి తెచ్చింది. ఇక దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది. అన్న క్యాంటీన్లను తిరిగి పున:ప్రారంభించింది. మెగా డీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే అన్నధాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మొదలు పెట్టనుంది.











